ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్.. 9లోగా అమలు చేయాలని ఆదేశాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్మ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9లోగా ఈ వారెంట్ను అమలు చేయాలని ములుగు పోలీసులను నాంపల్లిలో గల ప్రజాప్రతినిధుల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణకు పదేపదే డుమ్మా కొట్టడంతో ఈ మేరకు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.
సీతక్కతోపాటు వేర్వేరు కేసుల విచారణ కూడా చేపట్టింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికు కూడా సమన్లు జారీ చేసింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావు కూడా వివిధ కేసుల్లో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.
హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ప్రజాప్రతినిధుల ధర్మాసనం ముందుకు పలువురు నేతల పిటిషన్లు ముందుకొచ్చాయి.