ముంబై టు హైదరాబాద్: మంటల్లో ఆరెంజ్ బస్సు..బూడిద: తృటిలో తప్పిన పాలెం తరహా ప్రమాదం..
సంగారెడ్డి: ఘోర అగ్నిప్రమాదం తృటిలో తప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జాతీయ రహదారిపై సంభవించిన ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చేలా చోటు చేసుకున్న ఘటన ఇది. డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన మల్టీ యాక్సిల్ బస్సులో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో బస్సును అహూతి చేశాయి. పెట్రోలు బంకు ఎదురుగానే ఈ ఘటన చోటు సంభవించడం భయాందోళనలకు దారి తీసింది.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. గురువారం సాయంత్రం ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఈ బస్సు రామచంద్రాపురం సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు క్షణాల్లో బస్సు మొత్తాన్నీ వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. తొలుత ఇంజిన్ నుంచి దట్టమైన పొగ బయటికి రావడంతో డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. వెంటనే ప్రయాణికులను కిందికి దించేశాడు.
ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రయాణికులు తమ లగేజీని కిందికి దించుకోవడానికి కూడా సమయం లభించలేదంటే.. అగ్ని కీలలు ఎంత వేగంగా వ్యాపించాయో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులు కట్టుబట్టలతో నడిరోడ్డు మీద నిల్చుండిపోయారు. జాతీయ రహదారిపై పెట్రోలు బంకు ఎదురుగానే ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించడం ఉలిక్కి పడేలా చేసింది.
Recommended Video
అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే బస్సు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది పిలిపించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా నిర్దారించారు. ముంబైలో బయలుదేరిన బస్సు ఎక్కడా ఆగకుండా ప్రయాణించడం వల్ల ఇంజిన్ వేడెక్కి ప్రమాదానికి దాసి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.