TSRTC Strike: సీఎస్, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు, ఢిల్లీ రావాలని ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ జాతీయ బీసీ కమిషన్ను కోరింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీలో 20వేల మంది కంటే ఎక్కువగా బీసీలు ఉంటారని, వారిని డిస్మిస్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని తమ ఫిర్యాదులో పేర్కొంది.
ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టీ ఆచారీ స్పందించారు. ఈ విషయం చాలా సీరియస్ అని పేర్కొన్న బీసీ కమిషన్.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలంగాణ సీఎస్కు, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరుకావాలని ఆదేశించింది. గత 14 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ బంద్
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ బంద్ కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల నేతలు ర్యాలీలు తీయడంతో పోలీసులు అడ్డుకొన్నారు. మరికొన్ని చోట్ల బస్సులను అడ్డుకొవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాలు మద్దతు తెలుపడంతో రహదారులపై బస్సులు కనిపించలేదు. ర్యాలీ తీస్తున్న నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొన్నారు.
ఆర్టీసి కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపుకు తెలంగాణ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు స్వచ్చందంగా మద్దత్తు తెలిపి విజయవంతం చేసారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందని, బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని పలు రాజకీయ నేతలు బంద్ లో పాల్గొని అరెస్టులకు గురి కావడం శోచనీయన్నారు.
అయినప్పటికి కార్మికుల సత్తా ఏంటో భుత్వానికి ప్రత్యక్షంగా చూపించగలిగామని అన్నారు. ఇంత ప్రజ వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేక పోవడం దారుణమన్నారు అశ్వధ్దామ రెడ్ది. ప్రజాస్వామ్యాయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.