బెంగళూరును మించిపోయాం, సిటీలోనే నేసనల్ డిజైన్ సెంటర్: కేటీఆర్
హైదరాబాద్: ప్రపంచ డిజైన్ రంగానికి హైదరాబాద్ నగరం కేంద్రం కాబోతోందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తోపాటు ఆయన పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ ప్రగతిని ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభించిందని అన్నారు. హస్తకళలు, టూరిజం, ఫ్యాషన్, యానిమేషన్ తదితర రంగాల్లో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం వివిధ సంస్థలతో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
ఐటీ రంగంలో బెంగళూరు కంటే హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. నేషనల్ డిజైన్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోందని ఆయన అన్నారు.
అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర డిజైనింగ్ నైపుణ్యాలను తెలియజేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ డిజైన్ వీక్లో సీఐఐ వంటి సంస్థలతో కలిసి యువత నుంచి వినూత్న ఆలోచనలను సేకరించామని చెప్పారు. ప్రపంచ డిజైన్ రంగంతో హైదరాబాద్ కలిసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం తయారు చేసిన ఆసు యంత్రాలను చేనేత కళాకారులకు అందజేశారు కేటీఆర్.
ఇది ఇలా ఉండగా, త్వరలో జరగనున్న హుజూర్నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంపై మంత్రి కేటీఆర్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంఛార్జీలు, సీనియర్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్రచారం ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. వారం రోజులపాటు ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని మంత్రి అన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బూడిదలో పోసిన పన్నీరేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలమెంటో తెలిసిపోతుందని అన్నారు. ఇక్కడ బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడం కూడా గొప్ప విషయమేనని ఎద్దేవా చేశారు.