కేసీఆర్కు నై...చంద్రబాబుకు జై : బాబు చెంతకు దూతను పంపిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆయా పార్టీలు అప్పుడే తమ కసరత్తును ప్రారంభించాయి. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రులు దేశ రాజకీయాల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలని ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా... మరోవైపు కాంగ్రెస్,బీజేపీయేతర ప్రభుత్వం రావాలని కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు చంద్రలు దేశంలోని పలు పార్టీల అధినేతలతో కలుస్తున్నారు.
కేసీఆర్తో జట్టుకట్టేందుకు నవీన్ పట్నాయక్ విముఖత..?
లోక్సభ ఎన్నికలకు ఇంకా ఐదునెలల సమయమే ఉన్నందున దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా కూటమిలు కూడా తయారవుతున్నాయి. బీజేపీని మోడీ సర్కార్ను గద్దె దింపాలని చంద్రబాబు కాంగ్రెస్తో చేతులు కలిపి తన ప్రయత్నాలు కొనసాగిస్తుండగా... మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వం రావాలని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ గత కొద్ది రోజులుగా పలు ప్రాంతీయ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అయితే కొందరు ఓకే చెబుతుండగా మరి కొందరు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మొన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ను కలిశారు కేసీఆర్. అంతవరకు బాగానే ఉన్నా... నవీన్ పట్నాయక్ మాత్రం కేసీఆర్తో జట్టు కట్టేందుకు ఆయన సుముఖంగా లేనట్లు సమాచారం.
ఇదీ మమతా బెనర్జీ అనుభవం!: కేసీఆర్కు తృణమూల్ కాంగ్రెస్ నేత ఝలక్
చంద్రబాబు చెంతకు దూతగా బీజేడీ ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్
కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ రాకూడదని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారు. కేసీఆర్ భువనేశ్వర్కు వెళ్లి పట్నాయక్ను కలిసిన 24 గంటల్లోపే పట్నాయక్ తన పార్టీకి చెందిన ఎంపీ సౌమ్యరంజన్ పట్నాయక్ను దూతగా చంద్రబాబు దగ్గరకు పంపారు. అంతేకాదు తన మద్దతు చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న కూటమికే అని కబురు పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ముందునుంచి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలకు దూరంగానే ఉంటూ వచ్చారని చెప్పారు ఆ పార్టీ ఎంపీ రంజన్ పట్నాయక్. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తప్పులు చేశాయి, చేస్తున్నాయి.అయితే ఏపీ సీఎం చంద్రబాబు విధానం మాత్రం మతతత్వ పార్టీని కాదని సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని బిజూ జనతాదళ్ విధానం కూడా ఇదే కావడంతో చంద్రబాబు కూటమికే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు ఎంపీ రంజన్ పట్నాయక్.
మోడీని గట్టెక్కించే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారా..?
ఇదిలా ఉంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వెనక రానున్న సాధారణ ఎన్నికల్లో మోడీకి ఒక కవచంలా నిలిచి ఆయన్ను గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన ప్రతిపక్షాలు. అయితే ఈ వాదనను కేసీఆర్ కొట్టేసినప్పటికీ ఇంకా అనుమానాలు మాత్రం వీడలేదు. దీన్నే అవకాశంగా మలుచుకుని ఏపీ సీఎం చంద్రబాబు పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలసి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్కు దూరంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీని గట్టెక్కించేందుకే కేసీఆర్ తెరపైకి ఫెడరల్ ఫ్రంట్ తీసుకొచ్చారని కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కేసీఆర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో దీదీ తన సొంత గేమ్ ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. మూడురోజుల క్రితం దీదీని కేసీఆర్ కలిసినప్పుడు ఆయనతో కలిసి మీడియా ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఓ వైపు ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ... మరో వైపు ప్రధానితో సమావేశం ఎందుకు..?
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏ చిన్న అవకాశం దొరికినా తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరుగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టే యత్నం చేస్తున్నారు చంద్రబాబు. అంతేకాదు బుధవారం కేసీఆర్ మోడీని కలవడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. ప్రధాని మోడీని కేసీఆర్ కలిసింది రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమా లేక తను పలువురి ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి ఏంచర్చించారో నివేదిక ఇచ్చేందుకా అంటూ చంద్రబాబు విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కలుస్తున్న కేసీఆర్... ప్రధాని నరేంద్ర మోడీని కలవడంలో ఆంతర్యం ఏమిటని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
మొత్తానికి ఇద్దరు చంద్రులు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా లేదా అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు.