ఐసీయూలో నాయిని నర్సింహారెడ్డి..అత్యవసర వైద్యం: మంత్రి ఈటల రాజేందర్
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డికి అత్యవసర వైద్యం అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇటీవల నాయిని అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. శనివారం నాయిని చికిత్స తీసుకుంటున్న అపోలో ఆస్పత్రి మంత్రి ఈటల, కర్నె ప్రభాకర్ వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాయిని త్వరలో కోలుకుంటారని ఆశిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల నాయిని నరసింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో అపోలో ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం నాయిని నర్సింహారెడ్డికి కరోనా వైరస్ సోకగా.. చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు. కరోనా వైరస్ సోకే కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా..మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.
నాయిని నర్సింహారెడ్డి సతీమణి, పెద్ద కుమారుడుకు, అల్లుడు శ్రీనివాస్రెడ్డికి కూడా కరోనా వైరస్ సోకింది. కుమారుడు, అల్లుడు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. నాయిని నర్సింహారెడ్డి సతీమణి మాత్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాయిని నర్సింహారెడ్డి మరోసారి ఆస్పత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.
నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ తొలి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే రెండో దఫా ఆయనకు అవకాశం లభించలేదు. ఎమ్మెల్సీగా మాత్రం కొనసాగుతున్నారు. మండలి కూడా రెన్యువల్ చేస్తానని పెద్దలు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది.