సైనిక్పురిలో భారీ చోరీ: నేపాలీ వాచ్మెన్ దంపతులే నిందితులు, రూ. 2 కోట్ల అపహరణ
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్పురిలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో ఇంటి వాచ్మెన్ దంపతులే నిందితులుగా తేలింది. సుమారు రూ. 2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరీకి గురైనట్లు వ్యాపారి నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టి, ఇంటి వాచ్మెన్ దంపతులే చోరీ చేశారని పోలీసులు గుర్తించారు.
ఫలక్నుమా ప్యాలెస్లో యజమాని కుమారుడి వివాహం రిసెప్షన్కు కుటుంబమంతా వెళ్లిన సమయంలో వాచ్మెన్ (నేపాలీ)దంపతులు ఇంట్లో లాకర్ పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. నేపాల్ వాసీ భీమ్ గత ఆరు నెలలుగా వ్యాపారవేత్త ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. చోరీకి పాల్పడిన అనంతరం ఇంట్లోని ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో వదిలేసి వెళ్లిపోయాడు.
కుషాయిగూడ చౌరస్తాలో పోలీసులు ఆ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, చోరీ ఘటనపై మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మీడియాకు వివరాలను వెల్లడించారు. 1.73కిలోల బంగారం, రూ. 2లక్షల నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తంగా రూ. 2 కోట్లు విలువైన వస్తువులు పోయినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8గంటల మధ్య చోరీ జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఏడు బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.