అసెంబ్లీ ఎన్నికలకు కొత్త, అయినా గట్టిపోటీ.. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు?
హైదరాబాద్ : తొలిసారిగా అసెంబ్లీలో కాలు పెట్టాలనుకున్న చాలామందికి ఓటర్లు పట్టం కట్టలేదు. ఎమ్మెల్యేగా గెలవాలనుకుని మొదటిసారిగా బరిలో చాలామందే నిలిచినప్పటికీ కేవలం ఇద్దరికే అవకాశం ఇచ్చారు ఓటర్లు. ఒకరు మేడ్చల్ నుంచి గెలిచిన చామకూర మల్లారెడ్డి (CMR) కాగా మరొకరు అంబర్ పేట సెగ్మెంట్ నుంచి గెలిచిన కాలేరు వెంకటేశ్. వీరిద్దరు కూడా అసెంబ్లీ పోరులో నిలవడం ఇదే తొలిసారి.
మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగినా కూడా చాలాచోట్ల అభ్యర్థులు గట్టి పోటీనే ఇచ్చారు. అయితే ఓటర్ల విలక్షణ తీర్పుతో వారు ఏకంగా రెండోస్థానంలో నిలవడం విశేషం. కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుహాసిని రాజకీయాలకు కొత్త. నందమూరి కుటుంబ వారసురాలిగా ఆమెకు టికెటిచ్చి బరిలో నిలిపారు. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు పోటీచేసినప్పటికీ సుహాసిని గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కారు హవాతో ఆమె రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
శేరిలింగంపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆనంద ప్రసాద్, బీజేపీ నుంచి పోటీ చేసిన యోగానంద్.. వీరిద్దరూ రాజకీయాలకు కొత్తవారే. ఆనంద్ ప్రసాద్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, యోగానంద్ మూడో స్థానం దక్కించుకున్నారు. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఉప్పల్ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థి టి.వీరేందర్గౌడ్ రెండో స్థానం దక్కించుకున్నారు.
చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన షెహజాది రెండో స్థానంలో నిలిచారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ (మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు) కు రెండో స్థానం కట్టబెట్టారు ఓటర్లు. మహేశ్వరం సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహ్మత్ బేగ్ కు రెండో స్థానం.. టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తాకు మూడవ స్థానం దక్కింది.
మొత్తానికి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుని మొదటిసారి పోటీచేసిన అభ్యర్థులు చాలాచోట్ల ఢీ అంటే ఢీ అన్నారు. పోటీకి కొత్తవారే అయినా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపించడం విశేషం.