న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్యాన్, రిసార్ట్స్, పబ్లపై నిఘా..: సీపీ సజ్జనార్
కరోనా వైరస్, కరోనా వైరస్ స్ట్రెయిన్ వల్ల టెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రద్దు చేస్తున్నారు. జనం గుమికూడటం వలన వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉంది. కరోనా కన్నా కొత్త రకం వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అందుకు తగినట్టు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
Recommended Video
నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సీపీ సజ్జనార్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా అన్నిరకాల వేడుకలను నిషేధిస్తున్నామని తెలిపారు. న్యూ ఇయర్కి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రద్దు చేస్తున్నామని వెల్లడించారు. వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. రిసార్ట్స్, పబ్లపై నిఘా ఉంటుందని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని.. హద్దు మీరితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
స్టార్ హోటల్స్లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సజ్జనార్ చెప్పారు. సైబరాబాద్ పరిధిలో ఎలాంటి ఈవెంట్లకు అనుమతి లేదని వివరించారు. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలోనూ అనుమతి లేదని సజ్జనార్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. ఇందుకు తమకు ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.