11వ అంతస్తుపైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య: 10 నెలల కుమారుడి పోషణపై ఆందోళనే కారణం?
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ప్రియాంక శ్రీవాత్సవ(30)అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రియాంకకు అదే రాష్ట్రానికి చెందిన అనుబో చెత్రియాతో 2017లో వివాహం జరిగింది. గత కొంత కాలం క్రితమే హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వీరికి 10 నెలల కుమారుడు ఉన్నాడు.
గత మూడు నెలలుగా చందానగర్లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్మెంట్లో ప్రియాంక దంపతులు నివాసం ఉంటున్నారు. కాగా, బుధవారం తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, 10 నెలల కుమారుడి పోషణ విషయంలో గత కొంత కాలంగా ప్రియాంక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గచ్చిబౌలిలోని ఓ సంస్థలో బాధితురాలి భర్త అనుబో చెత్రియా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు.