షాపింగ్మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్కు కొత్త పాలసీ..బాదుడుకు చెక్ .. ఏప్రిల్ 1 నుండి అమలు
హైదరాబాద్ లో వాహనాల పార్కింగ్ ఎంత పెద్ద సమస్యనో అందరికీ తెలిసిందే. పార్కింగ్ ఫ్రీ ఉన్నచోట ఎవరు వాహనాలు పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం పార్కింగ్ సమస్య తో హైదరాబాదీలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు పేరుతో పెద్ద ఎత్తున దోపిడి కొనసాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ కు కొత్త పాలసీ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.
షాపింగ్ బిల్స్ చూపిస్తే గంట సేపు పార్కింగ్ చార్జ్ లేదు
హైదరాబాద్ లో పార్కింగ్ చార్జీల వసూలుతో జేబులకు చిల్లులు పడుతున్నాయని ప్రజల నుంచి మాల్స్ మరియు మల్టీప్లెక్స్ లపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా షాపింగ్ మాల్స్, మల్టీ ఫ్లెక్స్లను వినియోగిస్తే షాపింగ్ బిల్లు , సినిమా టిక్కెట్లు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ అని స్పష్టం చేసింది. షాపింగ్ చేసిన బిల్లు చూపిస్తే మొదటి గంట పార్కింగ్ ఉచితం కాగా , ఇక ఆపై సమయాన్ని బట్టి పార్కింగ్ రుసుమును వసూలు చేస్తారు.
మొదటి 30 నిముషాలు నో చార్జ్ ..
ఏ రకమైన షాపింగ్ బిల్లులు కానీ సినిమా టికెట్లు కానీ లేకపోతే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ చేసిన ఇతర వాహనాలకు కచ్చితంగా చార్జ్ చేస్తారు.
ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి 30 నిమిషాలకు హైదరాబాద్ మాల్స్ మరియు మల్టీప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు ఉండదు. ఇక మాల్ లో షాపింగ్ చేస్తే, అలాగే మల్టీప్లెక్స్ లలో ఏదైనా కొనుగోలు చేస్తే సదరు బిల్లును చూపిస్తే పార్కింగ్ సమయాన్ని మరో గంట పొడిగించవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏప్రిల్ 1 నుండి అమల్లోకి నూతన పాలసీ
ఇది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం కొత్తగా మాల్స్ మరియు మల్టీప్లెక్స్ లను ప్రారంభించబోతున్న పార్కింగ్ ఫీజు విధానం హైదరాబాద్ తోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పార్కింగ్ ఫీజుల బాదుడు తట్టుకోలేక పోతున్న ప్రజానీకానికి కాస్తంత ఊరట.