కోమటిరెడ్డి కొత్త ట్రిక్కులు.. రేవంత్ రెడ్డికి చిక్కులు..! టీ కాంగ్రెస్ లో విచిత్ర పరిణామాలు..!!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది..? తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఆదరణ పెంచుకోవాల్సిన చోట నిస్తేజం పడిపోయింది. ఉన్న కొద్ది మంది నేతల్లో కూడా సఖ్యత లేక పార్టీ కుదేలవుతోంది. నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ జోష్లో ఉంది. టీడీపీ హవా తగ్గటం టీఆర్ఎస్ను ఊపిరి పీల్చుకోనిచ్చింది. మరి హస్తం సంగతి లెక్కగట్టడమే చాలా కష్టంగా మారింది. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయినా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ పట్ల కిషన్రెడ్డి గౌరవంగా ఉంటాడు. అమిత్షా కూడా అదే విధంగా మెలుగుతాడు. కానీ కాంగ్రెస్లో ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి పట్ల మాత్రం ఎవ్వరూ గౌరవంగా మెలగరు. ముఖ్యంగా పార్టీ పెద్దలు అయితే ఉత్తమ్ను నాయకుడిగానే గుర్తించట్లేదంటూ తెగేసి చెబుతుంటారు.
టీ కాంగ్రెస్ లో నాటకీయ పరిణామాలు..! పీసీసీపై కన్నేసిన నేతలు..!!
కేంద్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో మాత్రం పార్టీ పీఠం తమకే కావాలని పట్టుపడుతున్నవారు చాలామందే ఉన్నారు. జానారెడ్డి, జయప్రకాశ్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా చాలామంది పేర్లే వినిపించినా చివరకు కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద పదవి ఆగిపోయింది. ఇంతకీ వెంకటరెడ్డి మనసులో ఏముంది.. బీజేపీ హవా నడుస్తుందంటాడు. తాను సోదరుడితో కలసి కాషాయం కప్పుకుంటాననే సంకేతాలు పంపుతాడు. ఇప్పుడు కొత్తగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు ఏ పార్టీ వద్దు.. కాంగ్రెస్లోనే ఉంటానంటూ కొత్త రాగం అందుకున్నాడు. పైగా తనకు పీసీపీ పీఠం అప్పగిస్తే.. 2023లో అధికారం సాధిస్తానంటూ ధీమాగా చెబుతున్నాడు.
రూటు మార్చిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి..! కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటన..!!
తమ్ముడు రాజగోపాల్రెడ్డి పార్టీ మారడం, మారకపోవడం ఆయన వ్యక్తిగతం అంటూ తనకేం సంబంధలేదన్నట్టుగా చెప్పేశారు. ఉత్తమ్ ఎంపీగా గెలిచాక, పార్టీలో కాస్త పట్టు పెరిగింది. కోమటిరెడ్డి సోదరులు పెట్టుకున్న ఆశలు వమ్ము అయ్యాయనే ప్రచారం జరిగింది. కానీ వెంకటరెడ్డి మాత్రం.. మొదటి నుంచి ఉత్తమ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. 2018 ఎన్నికలకు ముందు కూడా ఉత్తమ్ చేయించిన సర్వేలు.. గెలుపు స్పందనపై ఎద్దేవాచేశాడు. ఉత్తమ్ ఉన్నంత కాలం పార్టీ అధికారంలోకి రావటం సాధ్యం కాదంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.
వెంకటరెడ్డి అడుగులు..! రేవంత్ రెడ్డికి గుదిబండలు..!!
ఇప్పుడు తనను పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా కూలబడిన కాంగ్రేసును పరిగెత్తిస్తానంటున్నాడు. ఇది ఓ విధంగా పార్టీలో ఎదగాలని భావిస్తున్న రేవంత్రెడ్డికి కాస్త ఇబ్బందికరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొదటి నుంచి రేవంత్, ఉత్తమ్ వెంటనడిచాడు. తాను కూడా రేవంత్ను పార్టీలో ఎదిగేందుకు వీలు కల్పించాడు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందనేది రేవంత్ను అయోమయంలో పడేసిందనే భావన వ్యక్తమవుతోంది. అదిష్టానం దృష్టిలో మాత్రం రేవంత్ రెడ్డికి సానుకూల వాతావరణ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజానికంలోనే కాకుండా యువతలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును నేరుగా విమర్శించే సత్తా ఒక్క రేవంత్ రెడ్డికే ఉన్నట్టు ప్రజల్లో పెద్దఎత్తున విశ్వాసం ఉంది. ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశాలుగా విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్పై యుద్ధం కుంతియా, ఉత్తమ్ వల్ల కాదు..! ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి..!!
కేసీఆర్పై యుద్ధం చేయాలంటే కాంగ్రె స్ నాయకులు కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నికల ముందు ఈ విషయం చెప్పానని, ఆ తర్వాత కూడా చెప్పానని పేర్కొన్నారు. తాను కొన్నేళ్లుగా ఈ వ్యవహారంపై రెండు గదుల మధ్యే ఉన్నానని చెప్పారు. పార్టీ మీద ప్రేమతోనే పార్టీకి ఇంకా నష్టం వాటిళ్ల వద్దనే ఇలా వ్యవహరించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు. పలు ప్రకటనలు చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ జన్మనిచ్చిందని వెల్లడించా రు. అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీస్కు సమాధానమిచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు తనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం తాను ఎలాంటి తప్పు చేయలేదనే గుర్తించడం వల్లేనని తెలిపారు.