పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు..పేగు బంధం మరిచిన కసాయి తల్లి
హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపాపను తల్లి రోడ్డుపక్కన ఉన్న పొదల్లో వదిలేసింది. కళ్లు తెరిచి లోకం చూద్దామనుకున్న ఆ బుజ్జాయిని ఎవరూ లేని చోట విడిచి వెళ్లిపోయింది కసాయి తల్లి. ఒంటరిగా ఉన్న ఆ బుజ్జాయి ఏడవటం మొదలు పెట్టింది. ఏడుపు విన్న స్థానికులు ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో వెతికారు. రహదారికి కింద ఉన్న పొదల్లో పాపను చూసి చలించిపోయారు.
పొదల్లో పసికందు
క్షణకాలం పాటు చేసే పాపంవల్ల నవమాసాలు మోసి ఆపై బిడ్డను కని తమకేమీ సంబంధం లేదన్నట్లుగా చాలామంది తల్లులు వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలైతే కనడం వరకే బాధ్యత తీసుకుని ఆపై ఏ చెత్త బుట్టలోనో, ఏ ముళ్లకంపల్లోనో వదిలి వెళ్లిపోతున్నారు. ఏ మాత్రం దయా జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు కొందరు కసాయి తల్లులు. పంజాగుట్ట నిమ్స్ వద్ద ఓ బుజ్జాయిని వదిలి వెళ్లిపోయింది కసాయి తల్లి. ఈ హృదయవిదారకమైన దృశ్యం చాలామందిని కదిలించింది. తల్లి వదిలి వెళ్లిపోవడంతో పాపకు ఆకలైందో ఏమో తెలియదుగానీ ఏడవటం మొదలు పెట్టింది. చిన్నారికి తల్లి తోడు లేకపోయిన పిల్లలు భగవంతుడితో సమానం అంటారు కాబట్టి ఆ భగవంతుడే ఆ బిడ్డకు అండగా నిలిచాడు.
బిడ్డను చూసి బయటకు తీసిన స్థానికులు
స్థానికులు అటుగా వెళుతుండగా ఆ చిన్నారి బిగ్గరగా ఏడ్చింది. శబ్దం విన్న స్థానికులు బిడ్డకోసం వెతికారు. రహదారి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో ఆ బిడ్డ కనిపించడంతో వీరు చలించిపోయారు. కంచె వేసి ఉండటంతో దానిపై నుంచి అవతలికి దిగి చిన్నారిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి వెంటనే చికిత్స కోసం ఐసీయూలో చేర్చారు. ఏ కన్నతల్లి బిడ్డనో తెలియదుగానీ ఈ బుజ్జాయికి చికిత్స చేస్తున్న సమయంలో సిబ్బందికి కళ్లు చెమర్చాయి. తల్లెవరో తెలియని ఆ పసిబిడ్డ పడుతున్న వేదన వర్ణించలేనిది. చికిత్స జరుగుతున్న సమయంలో బిడ్డ వెక్కి వెక్కి ఏడుస్తుంటే అక్కడి వారు కదిలిపోయారు.
గాయాలకు తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చిన పసిబిడ్డ
తల్లి అలా చిన్నారిని వదిలి వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండి ఎంత వేదన అనుభవించిందో ఆ చిన్నారి. తల్లికోసం ఆతురుగా ఎదురు చూసి చూసి... కడుపుకు ఆకలి వేయడంతో ఏడ్చి ఉంటుంది. చిన్నారిని బయటకు తీయగానే ఆ పసి శరీరంపై ఉన్న గాయాలు చూస్తే అంతసేపు ఎలా భరించగలిగిందా అని అనిపిస్తుంది. బిడ్డ ఏడుస్తున్న సమయంలో అటూ ఇటూ కదిలినప్పుడు చిన్న చిన్న ముళ్లులు శరీరంలోకి గుచ్చుకుపోయాయి. ఆ ముళ్లు లోపలికి దిగడంతో బిడ్డ గుక్కపెట్టి ఏడ్చింది. గుక్కెడు పాలు కూడా లేకుండా అలానే ఒంటరిగా ఆ పొదల్లో గడిపింది చిన్నారి. బిడ్డ పరిస్థితిని చూసిన వారి కంట నీళ్లు ఆగలేదు. ఏదైమైనా బిడ్డ ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు చెప్పారు . ఇక కసాయి తల్లి ఎక్కడున్నా వచ్చి తన బిడ్డను తీసుకెళ్లాలని వైద్యులు కోరుతున్నారు.