ప్రగతి భవన్ను ముట్టడించిన బీజేపీ కార్పోరేటర్లు... పోలీసులతో వాగ్వాదం.. ఉద్రిక్తత...
జీహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పోరేటర్లు మంగళవారం(జనవరి 5) ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. ప్రగతి భవన్ వద్ద బీజేపీ కార్పోరేటర్లను పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు,బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కార్పోరేటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడినుంచి తరలించారు.
Recommended Video
కార్పోరేటర్లుగా ఎన్నికై నెల రోజులు గడుస్తున్నా జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచామని... ఎన్నికై నెల రోజులైనా ఇప్పటికీ తమకెలాంటి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కేసీఆర్,కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అరెస్టులు చేసేందుకు తామేమీ రౌడీలం కాదన్నారు.
అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశంలో బీజేపీ కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.
ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55,బీజేపీ 48,ఎంఐఎం 44,కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో జీహెచ్ఎంసీలో హంగ్ ఏర్పడింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ మేయర్ పదవి కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే పరిస్థితులు ప్రస్తుతం కనిపించట్లేదు. అయితే మేయర్ ఎన్నిక రోజు ఎంఐఎం గైర్హాజరవడం ద్వారా పరోక్షంగా టీఆర్ఎస్కు సహకరిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఈసారి మేయర్ పీఠం టీఆర్ఎస్కు ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుగా తయారైంది.
ఎద అందాలతో కనువిందు చేస్తున్న అదా శర్మ... లేటేస్ట్ ఫోటోలు