ప్రేమించి.. పెళ్లాడి.. చివరకు..
హైదరాబాద్ : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చిన్న చిన్న గొడవలు, అలకలు, బుజ్జగింపులతో నాలుగు నెలల పాటు అంతా సజావుగానే సాగింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ శనివారం ఇద్దరూ విగతజీవులయ్యారు. తాము అద్దెకుంటున్న ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెళ్లి పత్రికలను పంచబోతూ .. తిరిగిరాని లోకాలకు ...
4నెలల క్రితం ప్రేమ వివాహం
గోదావరి ఖనికి చెందిన బుర్ర సంతోష్ బంజారాహిల్స్లోని ఎయిర్టెల్ ఆఫీస్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న మొబైల్ షాప్లో మహబూబాబాద్కు చెందిన అర్చన పనిచేస్తుండేది. విధి నిర్వాహణలో భాగంగా వారిద్దరి మధ్య జరిగిన పరిచయం కొన్నాళ్లకుప్రేమగా మారింది. ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించి 4నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.
పెళ్లైన నాటి నుంచి గొడవలు
పెళ్లి తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ ఇంటి మూడో అంతస్థులో గది అద్దెకుతీసుకున్న సంతోష్, అర్చనలు అక్కడే కాపురం పెట్టారు. అర్చన, సంతోష్ పెళ్లికి ఇరు కుటుంబాలు తొలుత ఒప్పుకోలేదు. ఆ తర్వాత సంతోష్ పెద్దలు వీరి ప్రేమను అంగీకరించినా.. అర్చన ఇంట్లోవారు మాత్రం వారిని దూరం పెట్టారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసిన అర్చన ఈ మధ్యే మరో జాబ్లో జాయిన్ అయింది. అయితే పెళ్లైన దగ్గరి నుంచి దంపతుల మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు.
ఫ్యాన్కు ఉరేసుకుని..
శనివారం తెల్లవారుజామున సైతం గొడవపడ్డ సంతోష్, అర్చనలు ఉద్యోగాలకు వెళ్లలేదు. అయితే వారు పనిచేసే స్టోర్ తాళాలు వీరి వద్దే ఉండటంతో సహోద్యోగులు ఫోన్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో వారితో పాటు పనిచేసే హబీబ్ అనే వ్యక్తి సంతోష్ ఇంటికి వెళ్లాడు. ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా.. సంతోష్, అర్చనలు ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించారు. ఇంట్లో దృశ్యం చూసి భయపడిన హబీబ్ తొలుత స్థానికులకు ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలే ఆత్మహత్యలకు కారణమని అనుమానిస్తున్నారు.