పెళ్లయ్యాక అడ్డం తిరిగిన కథ.. ప్రేమ పెళ్లి చేసుకున్న టెకీ ఆత్మహత్య...
వాళ్లిద్దరిదీ ఒకే టౌన్... ఇద్దరూ క్లాస్మేట్స్... ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది. కానీ పెళ్లయ్యాకే కథ అడ్డం తిరిగింది. అతను తాగి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తాను మారిపోయానని,ఇక ఎప్పుడూ బాధపెట్టనని ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చి తీసుకెళ్లాడు. అలా కొద్ది రోజులు గడిచాయో లేదో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డికి చెందిన శరణ్య(25),అదే పట్టణానికి చెందిన తన క్లాస్మెట్ రోహిత్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. శరణ్య బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పెళ్లి తర్వాత అక్కడికే వెళ్లిపోయారు.అయితే మొదట్లో బాగానే ఉన్న రోహిత్... ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
నిత్యం తాగొచ్చి ఆమెను కొట్టేవాడు. రోహిత్ వేధింపులు తట్టుకోలేక 3 నెలల క్రితం శరణ్య కామారెడ్డిలోని పుట్టింటికి వచ్చింది. కొద్దిరోజులకు కామారెడ్డిలోని శరణ్య తల్లిదండ్రుల ఇంటికెళ్లిన రోహిత్... తాను మారిపోయానని చెప్పాడు. ఇంకెప్పుడూ శరణ్యను వేధింపులకు గురిచేయనని ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చాడు. ఇరువురి కుటుంబాల పెద్దల సమక్షంలోనూ ఇదే చెప్పాడు.
రోహిత్ను నమ్మి ఆమె తల్లిదండ్రులు శరణ్యను తిరిగి పంపించారు. ఇదే క్రమంలో శుక్రవారం(అగస్టు 7) ఆమె బెంగళూరులోని తమ నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. శరణ్య ఆత్మహత్య గురించి తెలిసి ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు. తమ కూతురిని రోహితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని శరణ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రోహిత్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వేధింపులే శరణ్య ఆత్మహత్యకు కారణమా... లేక మరేదైనా జరిగిందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.