బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్.. 4 ఏళ్లలో 3 లక్షల మందికి ఉపాధి: కేటీఆర్
ఐటీ హబ్ బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్ దూసుకెళ్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్తోపాటు ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీసు స్పేస్ విభాగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా నిలుస్తోందని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో ఆయా విభాగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఉద్దేశించిన టీ వర్స్క్ ఏప్రిల్లో ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
వచ్చే నాలుగేళ్లలో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ అండ్ మానుఫాక్చరింగ్ విభాగంలో కొలువులు లభిస్తాయని చెప్పారు. బెంగళూరు తర్వాత నూతన ఆర్ అండ్ డిజైన్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ నగరానికి మరింత మంచి పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు దేశం నుంచి ఎక్సెల్ స్కేల్ కంప్యూటర్ అభివృద్ధి చేయడం మనందరికీ గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ విభాగంలో దేశంలోనే హైదరాబాద్ ముందువరసలో నిలుస్తోందని ఆయన తెలిపారు.