తర్వాత లక్ష్యం తెలంగాణానే..! అదికారంలోకి వచ్చితీరుతామన్న అమీత్ షా..!!
హైదరాబాద్: తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి, బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణ లక్ష్యంగా పనిచేసి అదికారంలోకి వస్తామని అమీత్ షా తేల్చి చెప్పారు. తెలంగాణలో ప్రజల బతుకులు బాగు పడాలంటే భారతీయ జనతా పార్టీ గెలుపు అవసరం ఉందని బీజేపి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బీజేపి జెండా ఎగరవేస్తామని, అదే తమ ధ్యేయమని వివరించారు. తెలంగాణ సహా, ఏపీ, కేరళలోనూ బలపడతామని ధీమా వ్యక్తంచేశారు. శంషాబాద్లోని కేఎల్సీసీ హాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు.
తెలంగాణలో బీజేపి బలపడుతోంది..! వచ్చే ఎన్నికల్లో అదికారం చేపడతామన్న అమీత్ షా..!!
'బీజేపి అఖండ విజయం తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చా. తెలంగాణలోనూ త్వరలో బీజేపి జెండా ఎగురవేస్తాం. అదే మా ధ్యేయం. తెలంగాణలో ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపి గెలవాలి. మొన్నటి ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా భవిష్యత్లో అవతరించడం ఖాయం. ఆ దిశగా తెలంగాణ నేతలు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేస్తున్నా' అని అమిత్ షా అన్నారు.
Recommended Video
తెలంగాణలో ప్రభావం చూపిస్తాం..! బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో షా..!!
'కొన్ని సిద్ధాంతాల ఆధారంగా బీజేపి నడుస్తోంది. బీజేపి లో వారసత్వ రాజకీయాలు లేవు. కుటుంబ పాలన లేదు. మేం విజయానికి పొంగిపోలేదు. ఓటమికి కుంగిపోలేదు. ఆ పార్టీ ఓటమిని తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్ ఓ కుటుంబంపై ఆధారపడిన పార్టీ. మా వల్ల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. బీజేపిలో ప్రతి సభ్యుడికి ప్రాధాన్యం ఉంటుంది. కింది స్థాయి నాయకుడు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం బీజేపి కల్పిస్తోంది' అని షా అన్నారు. బడ్జెట్లో రైతులకు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, సమాజంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అందరి సంక్షేమమే బీజేపి లక్ష్యమని, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. అంతకుముందు పలువురు నేతలు అమిత్షా సమక్షంలో పార్టీలో చేరారు.
టీఆర్ఎస్ గాలి బుడగ లాంటిది..! మండి పడ్డ లక్ష్మణ్..!!
దేశ నిర్మాణం కోసం కృషి చేసే కార్యకర్తలే బీజేపి బలమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. తమ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందని చెప్పారు. శంషాబాద్లోని కేఎల్సీసీ హాలులో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. వారసత్వ నాయకులు భాజపాకు అవసరంలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఆస్ నేతల నియంతృత్వ, కుటుంబ పాలన నడుస్తోందని మండిపడ్డారు. కుటుంబ పాలనను అంతమొందించడమే బీజేపి లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చిరునామా గల్లంతైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నీటి బుడగ వంటిదన్నారు. వారణాసిలో బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని లక్ష్మణ్ చెప్పారు.
కర్ణాటక తర్వాత తెలంగాణలోనే పాగా..! కేసీఆర్ పాలనకు చరగీతం పాడతామన్న బీజేపి..!!
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని.. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపి అని లక్ష్మణ్ అన్నారు. గంగానదిలాంటి పవిత్రమైన తమ పార్టీ.. పవిత్రమైన ఆశయంతోనే పనిచేస్తోందని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు భాజపాలో స్థానం ఉందని చెప్పారు. ప్రతి పల్లెలోనూ మోదీ కార్యక్రమాలను ప్రచారం చేస్తామని చెప్పారు. పల్లెపల్లెల్లో ఇంటింటికీ వెళ్లి బీజేపి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని.. తద్వారా మహిళలు, యువతను పార్టీ సభ్యులుగా చేర్పిస్తామని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం బీజేపి వైపే చూస్తున్నారన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనన్నారు. రాష్ట్రంలో నయా నిజాం పాలనకు చరమగీతం పాడతామని లక్ష్మణ్ అన్నారు.