మరో మూడురోజుల్లో వర్షం.. వాతావరణ శాఖ అలర్ట్.. ఎక్కడ అంటే
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఎండ వేడిమి ఉన్నా కాస్త చల్లగానే ఉంది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షం కురుస్తోందని తెలియజేశారు. ఇదీ పంటలకు మంచి కాదని అన్నదాత అల్లాడిపోతున్నాడు. చెడగొట్టు వానలతో కీడే జరుగుతోందని వాపోతున్నాడు. కానీ ప్రకృతి మాత్రం రైతన్నపై ఎప్పుడూ కన్నెర్ర చేస్తూనే ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణాలో చాలా ప్రదేశాలలో పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గురువారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాత గుండె చేతిన పట్టుకొని చూస్తున్నాడు.మరికొద్దీ రోజుల్లో పంట చేతికి రానుండగా ఇలాంటి కబురు తెలియజేయడంతో ఆందోళనతో ఉన్నారు.