నిమ్స్ కు మహార్దశ ..? మరో వెయ్యి పడకల విస్తరణ
హైదరాబాద్ : వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం .. అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందింది. ఈసారి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్ .. వైద్య రంగంలో మరిన్ని పథకాలు తీసుకొచ్చి అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టంచేశారు.
మహార్దశ రానుందా ?
వైద్య మంత్రి చెప్పినట్టు నిమ్స్ కు మహార్దశ రానుందా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కూడా మ్స్ దవాఖాన అంటే మంచి వైద్యం అందిస్తుందనే పేరుంది. అయితే కొన్ని ఆధునాతన సదుపాయాలు, బ్లాకుల విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్ శుక్రవారం నిమ్స్ ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆధునాతన సౌకర్యాలు కల్పిస్తామని .. బెడ్ల సంఖ్య మరో వెయ్యి పెంచుతామని చెప్పారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు .. వివిధ సేవల్లో ఎలాంటి లోటుపాట్లు రావని అభిప్రాయపడ్డారు.
పేషెంట్ల సహాయకులకు వసతి
సాధారణంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో ఒకరిద్దరు ఉండాల్సి వస్తోంది. ఆ సమయంలో వారు ఉండేందుకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక నిమ్స్ లాంటి మంచి పేరున్న దవాఖాన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇబ్బందిని గుర్తించిన మంత్రి ఈటల రోగులతో వచ్చేవారి సౌకర్యాలపై దృష్టిసారించారు. అటెండెన్స్ కోసం నిర్మిస్తోన్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని స్పష్టంచేశారు. ఇందులో రెస్ట్ రూం, కిచెన్, హాల్, బాత్ రూం, టాయిలెట్ కోసం గదులు ఉంటాయని స్పష్టంచేశారు.
మరచిన కత్తెర .. బంధువుల ఆందోళన
అయితే ఇటీవల నిమ్స్ లో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. రోగికి ఆపరేషన్ చేసిన వైద్యులు .. కత్తెర మరచిపోయి కుట్లు వేశారు. నొప్పి వస్తోందని రోగి తిరిగి వస్తే .. వైద్యుల నిర్లక్ల్యం బయటపడింది. దీంతో అప్పటివరకు నిమ్స్ పై ఉన్న మంచి పేరు పోయింది. రోగుల బంధువులు ఆందోళన చేయడంతో .. నిమ్స్ వర్గాలు జరిగింది తప్పేనని సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కానీ ఆస్పత్రికి మాత్రం చెడ్డపేరు వచ్చింది.
వేగంగా స్పందించారనే ఆపవాదు ..
నిమ్స్ .. ఆధునాతన వైద్యం అందిస్తోన్న సర్కార్ ఆస్పత్రి. ఇక్కడికి వచ్చే రోగులు ఎక్కువే. అయితే అందరికీ సరైన సమయంలో వైద్యం అందించడం కష్టమవుతోంది. అసలే వీరు ప్రభుత్వ వైద్యులు .. సమయానికి రారు, వచ్చినా వెంటనే వెళ్లిపోతారు. ఈ క్రమంలో రోగికి ఏమైనా ఇబ్బంది ఉన్నా .. ఎమర్జెన్సీ కేసులపై త్వరగా స్పందించారనే అపవాదు ఉంది. మరి ఈ అపప్రదను తొలగించుకునేందుకు నిమ్స్ వైద్యులు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంది.
పేదలకు కార్పొరేట్ వైద్యం
రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు మంత్రి ఈటల. దీంతో వారు సర్కార్ దవాఖానలో వైద్యం కోసం వస్తున్నారని .. గతంలో కంటే ఈ సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. రోగులు పెరగడంతో తమకు సిబ్బంది కొరత ఏర్పడిందని .. ఇందుకోసం చర్యలు చేపడుతామని స్పష్టంచేశారాయన.