ధర్మపురి అర్వింద్ హౌస్ అరెస్ట్..
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బైంసాలో అల్లర్ల గురించి ఇవాళ సాయంత్రం బైంసా వెళ్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి బైంసాకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అర్వింద్ను పోలీసులు బంజారాహిల్లో అడ్డుకున్నారు. అనంతరం అర్వింద్ను ఆయన నివాసానికే తరలించారు. బైంసాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొదని అర్వింద్కు పోలీసులు సూచించారు.
బైంసాలో టెన్షన్ వాతావరణ నెలకొంది. ఆదివారం రాత్రి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైంసాలో 144 సెక్షన్ విధించారు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అర్వింద్ భైంసా వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పరిస్థితులు బాగోలేనందున పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
భైంసాలో ఇదివరకు కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి గొడవతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే అర్వింద్, ఇతర బీజేపీ నేతలు ఘటనాస్థలానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.