ఇంటర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు చెల్లవు: ఇంటర్ బోర్డు
హైదరాబాదు: ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు చెల్లవని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు వెల్లడించింది . ఈ మేరకు ఓ నోటీసును విడుదల చేసింది. అంతేకాదు కొన్ని కాలేజీలకు గుర్తింపు లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తొందరపడొద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది. త్వరలోనే ఇంటర్మీడియెట్ బోర్డుచే గుర్తించబడ్డ కాలేజీల జాబాతాను విడుదల చేస్తామని ఆ తర్వాతే తమ పిల్లలను కాలేజీల్లో చేర్పించాలంటూ కోరింది.
అంతకుముందు విద్యార్థి సంఘం స్టూడెంట్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులను కలిసి ఒక లేఖ ఇచ్చింది. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు చెందిన సిబ్బంది ప్రస్తుతం పదవ తరగతి పూర్తి చేసుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి తమ విద్యాసంస్థల్లో చేరాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ కల్పిస్తామని చెబుతూ ఆశ పెడతున్నారన్న విషయాన్ని ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకొచ్చింది ఎస్ఎఫ్ఐ.
ఇదే అంశం వివిధ మాధ్యమాల ద్వారా బోర్డు దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసుకుంటున్న పిల్లలను ముందుగానే తమ కాలేజీల్లో చేర్పించాల్సిందిగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది బోర్డు నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఇలాంటి చర్యలకు పాల్పడిన కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు 2020-21 విద్యా సంవత్సరానికిగాను అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వరాదని స్పష్టం చేసింది. ముందుగానే అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే ఆ అడ్మిషన్ను రద్దు చేయడంతో పాటు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
Recommended Video
ఇక వివిధ ఇంటర్ కాలేజీలకు అడ్మిషన్ పొందేందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అంతవరకు ఎవరూ ముందుగా కాలేజీలో విద్యార్థులను చేర్పించరాదని హెచ్చరించింది.