నో కన్ఫ్యూజన్, ఫుల్ క్లారిటీ.. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.. ఉత్తముడే రథసారధి..!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం రోజురోజుకీ ముదురుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అల్టర్నేట్ బీజేపీయే అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఆ క్రమంలో ఆయన బీజేపీలో చేరతారంటూ వార్తలొచ్చాయి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇటు కాంగ్రెస్ను వీడలేక.. అటు బీజేపీలో చేరలేక హస్తం గూటి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.
ఆ క్రమంలో రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పెద్దలు కన్ఫ్యూజన్కు గురవుతున్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే వాటిని ఖండించేలా గట్టిగా సమాధానం ఇచ్చారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా.
రాజగోపాల్ రెడ్డి తీరుపై అధిష్టానం గుస్సా
మాజీ ఎంపీ, ప్రస్తుత మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఆ పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ పార్టీ ద్వారా సంక్రమించే ప్రయోజనాలు పొందుతూ.. ఇతర పార్టీలకు వత్తాసుగా ఆయన మాట్లాడుతున్న విధానాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయే అంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదస్పదంగా మారింది.
అదలావుంటే రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ కావడం.. షోకాజ్ నోటీసులు ఇస్తామనడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ పార్టీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని.. ఆ పార్టీకి ప్రజలే షోకాజ్ నోటీసులు ఇస్తారని వ్యాఖ్యానించడం మరింత దుమారం రేపింది.
ఏకగ్రీవం సరే.. ప్రభుత్వ నజరానా ఏమాయే.. 10 లక్షలు వచ్చేదెన్నడో?
పొత్తుల పేరిట పార్టీని బజారు పడేశారు : రాజగోపాల్ రెడ్డి
ఇటీవల నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. గ్రూపు రాజకీయాలతో పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాను నిజాలు వెళ్లగక్కుతుంటే కాంగ్రెస్ పెద్దలకు మింగుడు పడటం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మహాకూటమి పేరుతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రజాగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్లే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్షమాపణ చెప్పాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్న కుంతియా
కాంగ్రెస్ హైకమాండ్ను ధిక్కరించే విధంగా రాజగోపాల్ రెడ్డి తీరు కొనసాగుతోందనే వాదనలు జోరందుకున్నాయి. ఆ క్రమంలో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డియే కొనసాగుతారని స్పష్టం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నుంచి బయటకు పోతేనే కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన దరిమిలా.. కుంతియా ఈ విధంగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పార్టీ ఓటమిపై నివేదికలు తెప్పించుకుని విశ్లేషించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29న నాగార్జున సాగర్లో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.