కపోతాల కాలం ముగిసినట్టేనా..? మేత వేయొద్దంటున్న జీహెచ్ఎంసీ..!!
హైదరాబాద్ : పక్షి ప్రేమికులకు ఈ వార్త అంతగా రుచించకపోవచ్చు. నగరంలో అడుగడుగునా దర్శనమిచ్చే పావురాల గుంపులు ఇక మీద కనుమరుగు కానున్నాయి. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన పావురాల సంతతిని గణనీయంగా తగ్గించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. పావులరాల విసర్జన వల్ల మనుషుల ఆరోగ్చానికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల తేలడంతో నగర పాలక ఉన్నతాదికారులు పావురాల పై దృష్టి సారించారు. పావురాలను ఎవ్వరూ కూడా పెంచుకోరాదని, వాటికి బహిరంగ ప్రాంతాల్లో ఆహారం కూడా వేయొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం కనిపిస్తున్న పావురాల గుంపులు భవిశ్యత్తులో కనిపించవన్న మాట.
పావురాల వల్ల ప్రమాదం.. వాటిని సంఖ్యను తగ్గించాలంటున్న నగరపాలక సంస్థ..
ఠప ఠప మంటూ రెక్కలు కొట్టుకుంటూ మీ ఇంటి కిటికీ మీద వాలే సందడి చేసే కపోతాలు ఇక కాలగర్బంలో కలిసిపోనున్నాయి. ఊర పిచ్చుకల మాదిరి పావురాళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి పోనుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసిన వందల సంఖ్యలో పావురాళ్లు దర్శనం ఇస్తుంటాయి. చాలా మంది పక్షి ప్రేమికులు వాటికి మేత వేస్తుంటారు. సినిమా వాళ్లు, సీరియల్ వాళ్లు కూడా పావురాల గుంపును తమ చిత్రాల సన్నివేశాల్లో వాడుకుంటుంటారు.
పావురాలకు ఆహారం వేయొద్దు.. ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ..
అంతే కాకుండా పక్షి ప్రేమికులు కొంత మంది హాబీగా కూడా పావురాళ్లను పెంచుకుంటుంటారు. ఇప్పుడిదంతా ఓ జ్ఞాపకంగా మిగిలిపోబోతోంది. కరెంటు తీగలమీద కనువిందుగా వాలిపోయే కపోతాలు కనుమరుగు కాబోతున్నాయి. పావురాల విసర్జన వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని ఓ సర్వేలో తేలడంతో నగర పాలక సంస్ధ అప్రమత్తమైంది. పావురాళ్లకు ఎవ్వరు కూడా మేత వేయొద్దనే ఆదేశాలు జారీ చేసారు. దశల వారీగా నగరంలో వాటి సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు చేపట్టింది నగరపాలక సంస్థ.
కనుమరుగు కానునున్న కపోతాలు.. వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందన్న నగరపాలక సంస్థ..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెరుగుతున్న పావురాల సంఖ్య ప్రజల ఆరోగ్యానికి సమస్యగా మారిందని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటి వల్ల మనుషుల్లో శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని, వాటికి ఆహారం వేయొద్దని సూచిస్తున్నారు. పావురాల రెట్టలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఫలితంగా మనుషుల అనారోగ్యానికి గురవుతున్నారని విశ్లేషిస్తున్నారు. పలు బహుళ అంతస్తుల భవనాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లు, దుకాణాలు ముఖ్యంగా ఆహార పదార్థాలు అమ్మే వారు వీటికి మేత వేయవద్దని చెపుతున్నారు.
అడవి దారి పట్టనున్న పావురాలు..సిటీ కి గుడ్ బై చెప్పనున్న కపోతాలు..
ఈ మేరకు నగర పాలక సంస్థ ఓ ప్రకటన చేసింది. నగరంలో ఉన్న హార్టీ కల్చర్ పార్కుల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని జీహెచ్ఎంసీ ఇప్పటికే నిషేధించింది. మరోవైపు మొజాంజాహి మార్కెట్లో పావురాలకు దాణాగా వేసే జొన్నలు, ఇతర తృణ ధాన్యాలను జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పావురాల రెట్టలతో చారిత్రక కట్టడాలు పాడవుతుండడంతో, ఇటీవల మొజాంజాహి మార్కెట్లో 500 పావురాలను పట్టి శ్రీశైలం అడవుల్లో వాటిని విడిచిపెట్టారు. అంచెలంచెలుగా నగరంలో పావురాల సంఖ్యను తగ్గించేందకు కార్యాచరణ రూపొందిస్తున్నారు నగరపాలక సంస్థ అదికారులు.