గుడుంబా గబ్బులేదు, క్లబ్బులు లేవు.. చేయాల్సి చాలా ఉంది: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. లింకు రోడ్లు, వైకుంఠదామాలు, అభివృద్ధి పనులు చేస్తున్నామని వివరించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా నేతలు, అధికారులు పాల్గొన్నారు.
బల్కంపేట్లో వైకుంఠదామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత సనత్నగర్లో థీమ్ పార్క్కు భూమి పూజ, క్రీడా సముదాయాన్ని ప్రారంభించారు. మోండా మార్కెట్ వద్ద నూతన గ్రంథాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు. మారేడ్పల్లిలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. వరదల సమయంలో ఏ పార్టీ కూడా బాధితులను ఆదుకోలేదని.. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కేటీఆర్ కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సిటీలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఇదివరకటిలా హైదరాబాద్లో క్లబ్లు లేవు.. గుడుంబా గబ్బు లేదన్నారు. సనత్ నగర్ నియోజక వర్గాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్పై గతంలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేశామని వివరించారు. ఇంకా సిటీలో చాలా పనులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్లో పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు. దశలవారీగా డబుల్ బెడ్ రూములను ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సనత్ నగర్లో గల రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తాం అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.