హెల్త్ ఎమర్జెన్సీ లేదు.. గాలి మాటలొద్దు.. విపక్ష నేతలపై మంత్రి గరం
హైదరాబాద్ : విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. నిజాలను తొక్కి పెడుతూ అబద్దాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలది అనవసర రాద్దాంతమే తప్ప అందులో వాస్తవాలు లేవని చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి.. సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు. విపక్ష నేతల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని.. ఆ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. విష జ్వరాలను అదుపు చేయడానికి డాక్టర్లు శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు.
చంద్రయాన్ 2 ప్రతి ఒక్కరూ వీక్షించండి.. ఫోటోలు షేర్ చేయండి.. మోడీ పిలుపు
హైదరాబాద్లో విష జ్వరాలను కంట్రోల్ చేయడానికి డాక్టర్లు అలర్ట్గా ఉన్నారని చెప్పిన మంత్రి.. ఆదివారం సైతం నిరంతర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అవేమీ తెలియకుండా విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు.
హెల్త్ ఎమర్జెన్సీ ఏమీ లేదని.. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని చెప్పుకొచ్చారు. దేశంలోనే నెంబర్ వన్ మెడికల్ సేవలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. డెంగీ విజృంభిస్తున్నప్పటికీ.. దానిని కంట్రోల్ చేసేలా చర్యలు స్పీడప్ చేశామని తెలిపారు. ఆ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని.. పబ్లిసిటీ స్టంట్ కోసం గాలి మాటలు మాట్లాడొద్దని సూచించారు.