మోదీ హైదరాబాద్ టూర్ : స్థానిక ఎంపీకే సమాచారం ఇవ్వరా.. రేవంత్ రెడ్డి ఫైర్...
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదన్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం,సమాచారం లేకపోవడం శోచనీయమన్నారు. ఇది ప్రధాని వ్యక్తిగత పర్యటన కాదని.. బీజేపీ సొంత కార్యక్రమం అంతకంటే కాదని... అలాంటప్పుడు స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. ఇలా చేయడం ఒక ప్రజాప్రతినిధిని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని.. లోక్సభ సమావేశాల్లోనూ లేవనెత్తుతానని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఆహ్వానం లేకపోవడం గమనార్హం. ప్రధాని పర్యటనపై పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది.
సంప్రాదాయాలకు,ప్రోటోకాల్కు తిలోదకాలిస్తూ రాష్ట్ర సీఎంను ప్రధాని పర్యటనకు ఆహ్వానించకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పు పడుతోంది. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శిస్తోంది.
Recommended Video
ఇక కరోనా వ్యాక్సిన్ టూర్లో భాగంగా ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో అడుగుపెట్టారు.హకీంపేట్ విమానాశ్రయంలో దిగిన ఆయనకు హకీంపేట్ ఎయిర్ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఆయన నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ను సందర్శించారు. అక్కడ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్ వివరాలను సైంటిస్టులను అడిగి తెలుసుకోనున్నారు.దాదాపు గంట పాటు బయోటెక్ ఫార్మా ప్లాంట్లో గడిపే అవకాశం ఉంది. హైదరాబాద్ టూర్ అనంతరం పుణేకి బయలుదేరుతారు.