నో మాస్క్ నో ఎంట్రీ: మసీదులోకి అనుమతి లేదు..
రంజాన్.. ముస్లింల పవిత్ర మాసం, ఈ నెల రోజుల వరకు ఉపవాస దీక్ష కొనసాగుతోంది. అయితే కరోనా వల్ల మసీదులకు వెళ్లేవారికి కూడా ఆంక్షలు విధించారు. మసీదులోకి ఎంట్రీ కోసం మాస్క్ కంపల్సరీ చేశారు. మూతికి మాస్క్ లేదంటే.. ఇక అంతే సంగతులు.. వారిని అక్కడే నిలిపివేస్తారు.
ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మక్కా మసీదు కతీబ్ రిజ్వాన్ ఖురేషీ తరావీ పవిత్ర ఖురాన్ను పఠించారు. రంజాన్ మాసం ప్రారంభం కావడం మక్కా మసీదును రంగుల లైట్లతో అలంకరించారు. బుధవారం నుంచి ఇఫ్తార్ విందు ప్రారంభం అయ్యింది.
విందుకు వచ్చేవారికి పంచేందుకు వెయ్యి కిలోల ఖర్జురాలను సిద్ధం చేశారు. కరోనా జాగ్రత్తల గురించి మక్కా మసీదు సూపరింటెండెంట్ ఎంఎ ఖాదర్ సిద్దిఖీ ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని మసీదులోకి రావాలని తెలిపారు. మాస్క్ లేని వారిని పోలీసులు మసీద్లోకి అనుమతించరని పేర్కొన్నారు. విందు, నమాజ్లో పాల్గొనే సమయంలో భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
మసీదుకు వచ్చేవారు తమ ఇళ్ల వద్దే వజూ చేసుకొని వెంట జానిమాజ్ తెచ్చుకోవాలన్నారు. రంజాన్ నెలలో మక్కా మసీదులోకి విజిటర్స్ని అనుమతించడం లేదని తెలిపారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ళు పైబడిన వృధ్దులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొనవద్దని కోరారు. ఈ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని కోరారు.