మంత్రి పదవులు రాలేదని.. మైనంపల్లి అలా.. జోగు రామన్న ఇలా..!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గంలో చోటు దక్కలేదని కొందరు అలకబూనారా? టీఆర్ఎస్ పార్టీలో తమదైన ముద్ర వేసి మంచి లీడర్లుగా ఎదిగిన తమకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారా? భాగ్యనగరంలో గులాబీ జెండా రెపరెపలాడేలా తన వంతు పాత్ర పోషించిన మైనంపల్లి హన్మంతరావుకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన ఏమనుకుంటున్నారు? ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇదివరకు మంత్రిగా పనిచేసిన జోగు రామన్నకు ఈసారి గులాబీ పెద్దలు ఎందుకు హ్యాండిచ్చారు? ఆ విషయంలో రామన్న వెర్షన్ ఎలా ఉంది? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో తాజా పరిణామాలు కొంతమేర సమాధానాలుగా మారాయి.
2014లో తొలి ప్రభుత్వం.. ఆనాడు ఇంతలా లేదే అసంతృప్తి..!
2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మంత్రివర్గం కూర్పుపై అసంతృప్తులు అంతగా కనిపించలేదు. ఎక్కడా కూడా నిరసన గళాలు వినిపించిన దాఖలాలు లేవు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కేబినెట్ ఏర్పాటుపై కొంత గందరగోళం కనిపిస్తోంది. తనతో పాటుగా మరో 11 మందిని మంత్రులుగా తీసుకుని మొత్తం 12 మందిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్. అదే క్రమంలో తాజాగా మరో ఆరుగురిని తన కేబినెట్లోకి తీసుకున్నారు. తొలి దఫా లేని అవకాశం ఈసారి కొడుకు, అల్లుడికి కల్పించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఆశ జూపారనే ప్రచారముంది. ఆ నేపథ్యంలో మంత్రి పదవులు దక్కనివారు తమదైన స్టైల్లో అలకబూనుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది.. మొన్న ఈటల, నేడు నాయిని.. అసంతృప్తుల సెగ వెంటాడుతోందా?
జోగు రామన్నకు ఎందుకు హ్యాండ్ ఇచ్చినట్లు.. కేసీఆర్ దగ్గర మంచి మార్కులే కదా..!
కేబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్నకు ఈసారి మంత్రి పదవి దక్కలేదు. తొలి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసిన రామన్నకు ఈసారి మంత్రి పదవి చేజారిపోయింది. తొలి దఫా కేబినెట్లో చోటు దక్కకున్నా.. విస్తరణలో కచ్చితంగా తన పేరు ఉంటుందని భావిస్తూ వచ్చారు. అయితే ఆరుగురికి మంత్రి పదవులైతే ఇచ్చారు గానీ.. అందులో తన పేరు లేకపోవడంతో కంగు తిన్నారు రామన్న.
అయితే మంత్రి పదవి దక్కకపోయేసరికి జోగు రామన్న అలకబూనినట్లు వార్తలొచ్చాయి. ఆ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అదలావుంటే రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రామన్న.. మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెస్ట్ తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. లో బీపీ వల్ల స్నేహితుడి ఇంట్లో సేద తీరానే తప్ప ఆజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చివరి వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని.. మా నాయకుడు కేసీఆరే అంటూ సెలవిచ్చారు.
ఇంద్రకరణ్ రెడ్డికి రెండోసారి.. మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన రామన్నకు..!
టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. జోగు రామన్నతో పాటు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. జోగు రామన్నను మాత్రం కేబినెట్లోకి తీసుకోలేదు. మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా తనకు అవకాశం వస్తుందని భావించిన రామన్నకు నిరాశే మిగిలింది. ఆయన సామాజిక వర్గానికే చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మంత్రి పదవి దక్కింది. ఆ క్రమంలో రామన్నతో పాటు ఆయన అనుచరగణం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
మైనంపల్లి హన్మంతన్న పరిస్థితి గిట్ల అయిందేందబ్బా..!
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ మేరకు కేబినెట్ విస్తరణకు ముందు ఆయన కేటీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రిగా ఛాన్స్ ఇస్తామంటూ కేటీఆర్ కూడా హామీ ఇచ్చారని.. తీరా కేబినెట్లో మాత్రం చోటు లేకుండా చేశారని వాపోతున్నారు మైనంపల్లి. ఆ క్రమంలో మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయన పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న తమ నేతకు మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
లీడర్గా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు (వీడియో)
ఇతరులకు పెద్ద పీట వేస్తున్నారని సీనియర్ల ఆవేదన..!
టీఆర్ఎస్ పార్టీలో ఇతరులకు పెద్ద పీట వేస్తున్నారనేది సీనియర్ల ఆవేదన. పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని ఇతరులను ముందు వరుసలో చూడటం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో హ్యాండ్ ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు ధైర్యంగా ముందుకొచ్చి బహిరంగ ఆరోపణలకు దిగుతుంటే.. మరికొందరేమో బాధను గుండె లోతుల్లో దిగమింగుకుని మళ్లీ కేసీఆర్కే జై కొడుతుండటం గమనార్హం.