కేసీఆర్ స్వరంలో మార్పు.!కరోనా పట్ల భయం అవసరం లేదనే సంకేతాలు.!అందుకే ఆ వ్యాఖ్యలు.!
హైదరాబాద్ : కొన్ని క్లిష్ట సందర్బాల్లో కొంత మంది తీసుకునే నిర్ణయాలు వారిని కథానాయకుడిని చేస్తాయి. అదే రాజకీయాల్లో తీసుకునే సాహసోపేత నిర్ణయాల వల్ల ఎదులేని నాయకత్వ లక్షణాలున్న నేతగా ముద్ర వేస్తాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్ ను ధీటుగా ఎదుర్కొని, వైరస్ ను తరిమికొట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాహసోపేత ప్రకటన చేసారు. అంటే కరతాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ కు భయపడేది లేదని, కరోనా వల్ల సంభవించే విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చునే ప్రసక్తే లేదని కరోనా వైరస్ కు ప్రతిసవాల్ విసిరారు చంద్రశేఖర్ రావు.
ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!
కరోనాకు భయపడి ఎంతకాలం తలుపులు మూసుకుంటాం.. కరోనాను ఎదుర్కొనేందకు సిద్దంగా ఉన్నామన్న కేసీఆర్..
ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్ధాయి సమావేశం తర్వాత సీఎం చంద్రశేఖర్ రావు తన స్వరాన్ని పూర్తిగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కరోనా వైరస్ పట్ల తన అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నట్టు స్పష్టమవుతోంది. కరోనా వైరస్ పట్ల తడబడకుండా నిలబడి తరిమికొడతామనే సంకేతాలిచ్చారు. కరోనా మహమ్మారికి భయపడింది చాలని, ప్రజలు సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చని స్వేచ్చా ద్వారాలను తెరిచారు చంద్రశేఖర్ రావు. ఒకవేళ కరోనా మరోసారి పంజా విసిరతే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. అందుకు తగ్గట్టుగానే లాక్డౌన్ ఆంక్షలనుండి చాలా వరకు మినహాయింపులు ప్రకటించారు చంద్రశేఖర్ రావు.
కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వద్దు.. సమర్థవంతంగా ఎదుర్కొందామంటున్న తెలంగాణ సీఎం..
ఒకప్పడు కరోనా వైరస్ అంటే కంగారు పడ్డ తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఇపుడు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పదులు, ఇరవై సంఖ్యల్లో నమోదైన కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన చంద్రశేఖర్ రావు, తాజాగా రోజుకు అరవై, డెబ్బై కేసులు నమోదవుతున్నా కరోనా ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టం చేస్తున్నారు. ప్రగతి భవన్ లో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం చంద్రశేఖర్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో ప్రజల్లో బాగా అవగాహన పెరిగిందని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటున్నారని, కరోనా వల్ల కేసులు పెరిగినా ధీటుగా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి ఉందని తెలిపారు. సీరియస్ లక్షణాలున్న 10 వేల మందికి వైద్యం చేయగలిగే సదుపాయాలున్నాయని తెలిపారు.
వ్యాపారాలు చేసుకోండి.. కాని జాగ్రత్తలు పాటించాలన్న గులాబీ బాస్..
అంతే కాకుండ సీఎం చంద్రశేఖర్ రావు లాక్డౌన్ ఆంక్షలనుండి సడలింపులు ఇచ్చినా కరోనా వ్యాప్తి పెద్దగా లేదని సాహసోపేతంగా ప్రకటించారు. దీంతో చంద్రశేఖర్ రావులో కరోనా వైరస్ కు సంబంధించిన భయాలు, అపోహలు పూర్తిగా పటాపంచలైనట్టు నిర్ధారణ అవుతోంది. తెలంగాణలో నమోదయ్యే కేసులు 85 శాతం సాధారణంగా ఏ లక్షణాలు లేకుండా ఉన్న కేసులేనని, మిగతా 15 శాతంలో 10 శాతం సాధారణ జలుబు దగ్గు వంటి కేసులని, మిగతా 5శాతం కేసులు మాత్రమే ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు తెలంగాణ సీఎం. దీంతో లక్ష కేసులు నమోదైనా ఎదుర్కొనే సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్న భరోసా ముఖ్యమంత్రిలో కనిపిస్తోంది. అందుకే లాక్డౌన్ ఆంక్షలు అవసరం లేదని చంద్రశేఖర్ రావు భావిస్తూ వ్యాపారాలకు మరిన్ని సడలింపులు ఇచ్చారు.
అప్పడాల ప్యాకెట్ కోసం ఆబిడ్స్ వెళ్లొద్దు.. మితంగా ఉంటూనే కరోనాను తరిమికొట్టాలన్న సీఎం..
ప్రజలు తమకు తాము ముందస్తు జాగ్రత్తగా ఉండి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని, పని ఉన్నా లేకున్నా నలుగురిలో కలవడం తగ్గించుకోవాలని, అత్యంత అవసరానికి మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. అప్పడాల ప్యాకెట్ కోసం అమీర్ పేట వెళ్లాలనే ఆలోచన విరమించుకోవాలని చంద్రశేఖర్ రావు సూచించారు. ఇక మీదట అందరూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని, అయితే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు. కరోనాతో సహజీవనం తప్పదు కాబట్టి కట్టడి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేననే అభిప్రాయాన్ని చంద్రశేఖర్ రావు వ్యక్తం చేసారు. కరోనా ఫ్రీగా జిల్లాలు మారినా, సడలింపుల వల్ల మళ్లీ కరోనా వ్యాపించిందని, అయితే కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరూ సాధారణ జీవనానికి సన్నాహాలు చేసుకోవాలని చంద్రశేఖర్ రావు సాహసోపేత పిలుపునిచ్చారు.