TSRTC Strike: కేసీఆర్ డెడ్లైన్ పెట్టినా.. ఎవరూ విధుల్లో చేరలేదు: అశ్వత్థామరెడ్డి, చర్చలకు ఓకే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 5వ తేదీలోపు విధుల్లో చేరాలని స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవ్వరూ విధుల్లో చేరలేదని, చేరే ప్రసక్తే లేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. జేఏసీలోని అన్ని ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించుకున్నాయని చెప్పారు. నిన్న 11 మంది విధుల్లో చేరితే.. ఐదుగురు ఈ రోజు మళ్లీ వచ్చేశారని తెలిపారు.
ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించండి.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను మానవీయ కోణంలో చూడాలని, సమస్యను పరిష్కరించాలన్నారు. చర్చిస్తే తాము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
TSRTC Strike: సీఎం ఆఫర్పై అసదుద్దీన్ ఓవైసీ స్పందన: కేసీఆర్కు కీలక సూచన
బేషరతుగా విధుల్లో చేరడాన్ని కార్మికులు అంగీకరించడం లేదని చెప్పారు. మంగళవారం అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం ఉంటుందని తెలిపారు. మంగళవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోల ముందు మానవ హారాలు నిర్వహించాలన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ ఆర్టీసీ జేఏసీకి సంబంధం లేదని జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని జేఏసీని చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, నవంబర్ 5లోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. 5లోగా విధుల్లో చేరిన వారికి రక్షణ కల్పిస్తామని, చేరని వారితో ఆర్టీసీ సంస్థతో సంబంధాలు తెగిపోయినట్లేనని స్పష్టం చేశారు. అయితే, కేసీఆర్ అల్టిమేటం నేపథ్యంలో పలువురు కార్మికులు విధుల్లో చేరారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పదుల సంఖ్యలో విధుల్లో చేరారు.