15వ తేదీ నుంచి స్కూల్స్ తెరవం, 1వ తేదీ నుంచి మాత్రం కాలేజీలకు ఓకే: మంత్రివర్గ ఉపసంఘం
కరోనా వైరస్ విజృంభణ వల్ల రాష్ట్రంలో ఇప్పట్లో పాఠశాలలు తెరచుకునే అవకాశం కనిపించడం లేదు. అన్ లాక్ 5.0 గైడ్లైన్స్లో ఈ నెల 15వ తేదీ నుంచి విద్యాసంస్థలను తెరచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే తెలంగాణలో మాత్రం 15వ తేదీ నుంచి స్కూల్స్ తెరవబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. వైరస్ విజృంభణ, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున స్కూల్స్ ఓపెన్ చేయబోమని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో ప్రహ్లాద్ జోషి
ఇప్పట్లో తెరవం..
15వ తేదీ నుంచి స్కూళ్లు తెరవడం సాధ్యం కాదని మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
దసరా తర్వాత..
విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచేదీ అనే అంశాన్ని దసరా తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా నవంబరు 1 నుంచి ఉన్నత విద్యాశాఖ పరిధిలో గల కాలేజీలను మాత్రం తెరుస్తామన్నారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
50 శాతం విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు 50 శాతం మంది విద్యార్థులు ఒకరోజు తరగతులకు హాజరైతే.. మిగతా వారికి ఆన్లైన్ ద్వారా బోధించాల్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్లో విద్యార్థులకు ఆన్లైన్ బోధన తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Recommended Video
పేరంట్స్ అభిప్రాయం కూడా
పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్లకు సరైన సిగ్నల్స్ లేని కారణంగా వారికి విద్య అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో నిబంధనలు ఒకేలా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మరో మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.