పాదయాత్రకు అనుమతి నిరాకరణ: పోలీసుల అదుపులో బండి సంజయ్, కరీంనగర్కు..
హైదరాబాద్: నవంబర్ 28 (సోమవారం) నుంచి బైంసాలో ప్రారంభం కానున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి భైంసాకు బయలుదేరారు. సోమవారం జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బండి సంజయ్ వాహనాన్ని చుట్టుముట్టిన పోలీసులు
నిర్మల్ వెళుతున్న బండి సంజయ్ను జగిత్యాల దాటాక అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలిపి బండి సంజయ్ను చుట్టుముట్టారు పోలీసులు. పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్కు బండి సంజయ్ను తరలించారు.
కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఏం కాపాడతారని నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించలేని సీఎం ఇంట్లో కూర్చోవాలని అన్నారు. పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మరోవైపు, పోలీసుల తీరుపై మండిపడుతూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, భైంసా నుంచి కరీంనగర్ వరకు 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగనుంది.
డిసెంబర్ 17న కరీంనగర్ జిల్లాలో ఈ యాత్ర ముగియనుంది. ఐదో విడతలో జరిగే ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు.