20 వేల లీటర్ల వరకు నో బిల్.. చర్యలు చేపడుతోన్న అధికారులు... ఇచ్చిన హామీ మేరకు
గ్రేటర్ ఎన్నికలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 20 వేల లీటర్లు వాడేవారికి మంచినీటి బిల్లు ఉండదు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతీ గృహ అవసరాల నల్లా కనెక్షన్కూ ప్రతీ నెలా 20వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని అమలు చేసేందుకు వాటర్బోర్డు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ నెలలో జారీ చేసే డిసెంబర్ నెల నీటి బిల్లులో ఆ స్కీమ్ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నెలలో కేవలం 20 వేల లీటర్ల లోపు నీటిని వాడుకునే వారికి జీరో బిల్లులు, అంతకుమించి వాడిన వారికి 20 వేల లీటర్లను మినహాయించి మిగిలిన దానికి బిల్లులు జారీ చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో వాటర్బోర్డుకు ఉన్న 10.60లక్షల నీటి కనెక్షన్లలో సుమారు 9 లక్షలకు పైగా గృహ అవసర కనెక్షన్లు ఉంటాయి. ఇందులో బస్తీలు, మురికివాడల్లో నివసించే కుటుంబాలు ప్రతీ నెలా 15వేల లీటర్ల నీటిని వినియోగిస్తూ రూ.160 వరకు బిల్లులు చెల్లిస్తుండగా, మధ్య తరగతి కుటుంబాలు ప్రతీ నెలా 20వేల లీటర్లకు పైగా వినియోగిస్తుండగా, ఈ నీటికి సుమారు రూ.280 వరకు చెల్లింపులు చేస్తున్నారు.
ఉచితంగా తాగునీరు అందించడంతో 20వేల లీటర్ల లోపు నీటి బిల్లులు వాడుకునే వారందరూ ఇప్పుడు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. సివరేజీ సెస్ కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా జీరో బిల్లులే జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికారిక ఉత్తర్వులు రేపో, మాపో వెలువడుతాయని, ఆ మేరకు బిల్లులను జారీ చేస్తామని అధికారులు తెలిపారు.