నిండు గర్భవతిలా ఎలక్షన్ కోడ్.. తెలంగాణలో సంక్షేమ పథకాలకు అడ్డంకేనా?
హైదరాబాద్ : ఎన్నికల కోడ్ నిండు గర్భవతిని తలపిస్తోంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలు రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు కోడ్ కూస్తూనే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి జూలై నెల వరకు జరగనున్న వరుస ఎన్నికలతో 9 నెలల పాటు ఎన్నికల కోడ్ నిర్విరామంగా కొనసాగుతోంది. మొన్నటివరకు శాసనసభ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు.. ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు.. తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, అనంతరం మండల, జడ్పీ ఎన్నికలు.. ఇలా వరుస ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికల కోడ్ సాగుతూనే ఉంది. వరుస ఎన్నికల పర్వంతో కొన్ని సంక్షేమ పథకాలకు బ్రేక్ పడుతోందనే వాదనలున్నాయి.
కల్యాణ లక్ష్మికి ఎన్ని ఆటంకాలో..! చెక్కులేవి?.. వేల సంఖ్యలో పెండింగ్
కోడ్ కూత
తెలంగాణలో వరుస ఎన్నికలు సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకిలా మారుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. శాసనసభ, పంచాయతీ పోరులో భాగంగా కొన్ని పథకాలకు బ్రేక్ పడినట్లైంది. అధికారులంతా విధి నిర్వహణలో బిజీబిజీగా ఉంటే కల్యాణ లక్ష్మి చెక్కులు రాక ఆడపిల్లల తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలొచ్చాయి.
అదొక్కటే కాదు ఇలా చాలా ప్రభుత్వ పథకాల్లో ఒకడుగు ముందకు పడుతుంటే రెండడుగులు వెనక్కి పడుతున్న చందంగా తయారైంది పరిస్థితి. అదలావుంటే వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూస్తూనే ఉంది. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నుంచి చూసుకున్నట్లయితే రానున్న మండల, జడ్పీ ఎన్నికల (జులై నెల) వరకు దాదాపు 9 నెలల సమయం కోడ్ అమల్లో ఉన్నట్లే.
వరుస ఎన్నికలు.. కొనసాగుతున్న కోడ్
ముందస్తు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి కీలక పథకాలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారబోతోంది. తొలిసారిగా అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో.. నిరుద్యోగ భృతి ఈసారి పకడ్బందీగా వీలైనంత త్వరగా అందించాలని భావించింది.
కానీ వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్ అడ్డంకిగా మారబోతుందా? నిరుద్యోగ భృతి మరింత ఆలస్యం కానుందా? అనేది ప్రశ్నార్థకమే. ఇక పింఛన్లు పెంచుతామనే విషయంలో కోడ్ అడ్డంకి కాబోదనే ప్రచారం జరుగుతోంది. పాత పథకం కొనసాగింపే కాబట్టి దానికి పెద్దగా అడ్డంకులు ఏమి ఉండబోవని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి సంబంధించి ఎమ్మెల్యేలు చెక్కులిచ్చే పరిస్థితి లేనందున జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఒకదాని వెంబడి మరొకటి
అలా లోక్సభ ఎన్నికల పర్వం ముగుస్తుందో లేదో మున్సిపల్ ఎన్నికలు తెరపైకి రానున్నాయి. పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్లను ఇటీవలే హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాలకవర్గాల కాలవ్యవధి ముగిసిన మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా చేస్తోంది.
మున్సిపల్ ఎన్నికల తంతు అయిపోగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముంచుకొస్తాయి. మండల పరిషత్, జడ్పీ ప్రాదేశిక ఎన్నికలు మే నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే ఒక ప్రతిపాదన కూడా పంపింది ఎన్నికల సంఘం.
జులై వరకు ఇందే తంతు
లోక్సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానుండటంతో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలను జూన్, జులై నెలల్లో నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పది పదిహేను రోజుల్లోగా మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు చేపడతారు. అవి పూర్తి చేశాక సహకార ఎన్నికలను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.