కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్
తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ శాతం పెరిగే అవకాశం ఉందికాబట్టి ఆమేరకు అనుగుణంగా పట్టణాలను తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని, అందుకోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయన తెంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
విధులతోపాటు నిధులూ..
కొత్తగా ఎంపికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లకు మున్సిపల్ చట్టంపై శిక్షణ ఇస్తామన్న మంత్రి కేటీఆర్.. అందుకోసం అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కలిపి ఏటా రూ.2047 కోట్ల నిధులు వస్తాయని, అందులో కేంద్రం, రాష్ట్రాలు సమానంగా రూ.1037వేల కోట్లిస్తాయని తెలిపారు. ఆ లెక్కన మున్సిపాలిటీలకు నెలకు రూ.175 కోట్లు అందుతాయని, ప్రతినెల ప్రతినెల మొదటి వారంలోనే ఠంచనుగా అకౌంట్లలో డబ్బులు జమచేస్తామన్నారు. కేవలం విధులు గుర్తుచేసి వదిలేయబోమని.. కడుపునిండా నిధులు కూడా ఇస్తామని కేటీఆర్ చెప్పారు.
ఢిల్లీ మోడల్ ను తీసుకొస్తాం..
రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేందుకే కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించామని, పౌరులే కేంద్రంగా కొత్త చట్టం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అవినీతికి ఆస్కారంలేని, టైమ్ బౌండ్ పద్ధతిలో పౌరసేవలు అందిస్తామన్నారు. ఢిల్లీలో అమలవుతోన్న భాగీదారి వ్యవస్థ తరహాలో ఇక్కడి మున్సిపాలిటీల పాలనలోనూ పౌరులకు చోటు కల్పిస్తామని, ఎక్కడిక్కడ యూత్ కమిటీ, విమెన్, సీనియర్ సిటిజన్ కమిటీ, రెసిడెంట్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
క్యూఆర్ కోడ్తో కొత్త డోర్ నంబర్లు..
పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో పట్టణాల్లోని ఇండ్లకు క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త డోర్ నంబర్లు కేటాయిస్తామని, సెల్ఫ్ సర్టిఫికేషన్ పద్ధతిలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు ఇస్తామని, బర్త్, డెత్, ల్యాండ్ రిజిస్ట్రేషన్లన్నీ ఆన్ లైన్ లో టైమ్ బౌండ్ పద్ధతిలో ఇస్తామని, వీటి జారీలో తప్పుచేసిన సిబ్బందికి కఠిన శిక్షలు వేస్తామని మంత్రి చెప్పారు.
కలెక్టర్లతో టాస్క్ ఫోర్స్..
మున్సిపాలిటీల్లో జవాబుదారితనం పెంపొందించే క్రమంలో మరెన్నో మార్పులు తీసుకొస్తామని, బడ్జెట్ లో 10 శాతాన్ని పర్యావరణానికే వాడుతామని, 21 రోజుల్లో భవనిర్మాణాలకు అనుమతులిచ్చేలా, తప్పుచేసిన సిబ్బందిని అవసరమైతే సర్వీసుల నుంచి తొలగించేలా కఠిన నిబంధలు ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల అడ్డుకట్టకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేస్తామని, నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ బిల్డింగులు కూల్చేస్తామని, ఈ పనులన్నింటిలో మున్సిపాలిటీ పాలకవర్గం పాత్ర ప్రధానమైందని మంత్రి చెప్పారు.