ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే వెళతారు. అంతటి మహాద్భుతమైన కట్టడం పర్యాటకులకు మరింత కనువిందు చేయనుంది. ఎల్ఈడీ బల్బులతో ధగధగ మెరిసిపోయేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సరికొత్త చార్మినార్
చారిత్రక కట్టడం చార్మినార్.. హైదరాబాద్ కు మణిమకుటంలా నిలుస్తోంది. పర్యాటకులను ఆకట్టుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే రాత్రివేళల్లో చార్మినార్ మరింత అందంగా కనిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్మినార్ వెలుపల 190 వాట్స్ ఎల్ఈడీ లైట్లను అమర్చడానికి సిద్ధమవుతున్నారు. దీంతో దూరం నుంచి కూడా చార్మినార్ అందంగా కనిపించనుంది. ఆ మేరకు వారం రోజుల్లో లైట్లు బిగించేలా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ఢిల్లీలాగా..!
సాలార్జంగ్ మ్యూజియం ఎదురుగా 231.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వంతెనతో పాటు.. చిరు వ్యాపారుల కోసం నయాపూల్ దగ్గర మరో వంతెన నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పనులకు సంబంధించి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియ కొనసాగుతోంది. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా ఉపాధి కోల్పోయే చిరు వ్యాపారులకు ఈ వంతెనలు ఊరట కలిగించనున్నాయి. వీటిపై చిరు వ్యాపారాలు జరుపుకొనే అవకాశం కల్పించనున్నారు అధికారులు. ఢిల్లీలోని పాలికా బజార్ మాదిరిగా ఈ నిర్మాణం ఉండబోతోంది. అటు మూడు వరుసలు, ఇటు మూడు వరుసల్లో షాపులు.. మధ్యలో మీటింగ్ పాయింట్ తో పాట్లు క్లాక్ టవర్ నిర్మించనున్నారు. అంతేగాదు చార్మినార్ చూడటానికి వచ్చే టూరిస్టుల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఓ మల్టీ కాంప్లెక్స్ కూడా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు.
పాదచారుల ప్రాజెక్టు.. చార్మినార్ కు సరికొత్త రూపు
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తోపుడు బండ్లతో పాటు ఫుట్పాత్ వ్యాపారాలు నిర్వహించేవారిని అక్కడినుంచి తరలిస్తున్నారు. బండలు పరిచి పేవ్మెంట్ పనులు పూర్తిచేయడంతో చార్మినార్ కొత్త సొబగులు సంతరించుకుంది. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో భాగంగా కొత్తరూపు సంతరించుకునేలా.. డక్కన్ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణశైలి ఉండబోతోంది. చార్మినార్ ద్వారాల వంటి డిజైన్లు.. అటు వైపు వెళ్లే వీధుల్లోని భవనాలకు సైతం ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. చార్మినార్ అభివృద్ధి, సుందరీకరణ బాధ్యతను ఎన్టీపీసీకి అప్పగించారు.