జయరాం హత్య కేసు: శిఖా చౌదరి కాల్ లిస్ట్లో క్రికెటర్ పేరు? ఆఖరి ఫోన్ కాల్ ఎవరికంటే?
హైదరాబాద్/అమరావతి: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసును కృష్ణా జిల్లా పోలీసులు హైదరాబాదుకు బదలీ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు అంశంపై బంజారాహిల్స్ పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జయరాం సతీమణి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శిఖా చౌదరి పాత్రపై దర్యాఫ్తు చేయాలని ఫిర్యాదు చేశారు.
కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం
జయరాం హత్య కేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను విచారించేందుకు నందిగామ కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈ కేసులో శిఖా చౌదరి, శ్రీనివాస్ను ప్రశ్నించనున్నారు. పద్మశ్రీతోను ఫోన్లో మాట్లాడి వివరాలు తీసుకోనున్నారు. కేసులు అనేక ట్విస్టులు తిరుగుతోన్న విషయం తెలిసిందే.
శిఖా చౌదరి కాల్ డేటాలో క్రికెటర్ పేరు?
ఇదిలా ఉండగా, శిఖా చౌదరి కాల్ డేటాలో ప్రముఖ క్రికెటర్ పేరు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జయరాం హత్య జరిగిన రోజు సదరు క్రికెటర్.. శిఖాచౌదరి విల్లాకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సదరు క్రికెటర్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మ్యాచ్లు ఆడినట్లుగా కూడా గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'
ఆఖరి కాల్ శిఖా చౌదరికే.. పద్మశ్రీ రాకముందే డాక్యుమెంట్లు..
అలాగే, హత్యకు ముందు రోజు జయరాం నుంచి శిఖా చౌదరికి ఆఖరి కాల్ వెళ్లింది. హత్యకు ముందు రోజు రాత్రి ఏడున్నర గంటల వరకు శిఖా చౌదరి ఇంట్లోనే జయరాం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హత్య జరిగిన రోజు సంతోష్ అనే వ్యక్తితో శిఖా చౌదరి ఇంటికి జయరాం వచ్చాడని గుర్తించారని తెలుస్తోంది. మరోవైపు, జయరాం భార్య పద్మశ్రీ రాకముందే జయరాం ఇంట్లోని డాక్యుమెంట్లు తెచ్చుకోవాలని శిఖా చౌదరికి తల్లి సూచించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
9 నెలలుగా రాకేష్ రెడ్డితో దూరం
కాగా, తన మామయ్య జయరాం హత్య కేసుతో తనకు సంబంధం లేదని, తనపై ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారో తెలియదని, తనకు ఆ రోజు ఫోన్ చేసి అత్యవసరంగా రూ.కోటి అడిగారని, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చునని శిఖాచౌదరి గురువారం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. తన మామయ్య జయరాం జనవరి 29వ ఇంటికి వచ్చి భోజనం చేశారని, తన ప్రాజెక్టు గురించి చర్చించానని, ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. తనకు మరుసటి రోజు సాయంత్రం నాలున్నర గంటలకు ఫోన్ చేసి రూ.కోటి అడిగారని, ఎందుకు అని అడిగితే.. ఒకరి దగ్గర రూ.4 కోట్లు తీసుకున్నట్లు చెప్పారని, తాను మరిన్ని వివరాలు అడిగేలోపు కాల్ కట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత పర్సనల్ నెంబర్కు సందేశం పంపించి వివరాలు అడిగానని చెప్పారు. మరుసటి రోజు ఉదయం అమ్మ తనకు ఫోన్ చేసి మావయ్య ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పిందని, కానీ తొలుత దానిని హత్యగా భావించలేదన్నారు. మావయ్య వద్ద తన పర్సనల్ ప్రాజెక్టు ఫైల్ ఉందని, దానిని తీసుకోవడానికే వెళ్లానని చెప్పారు. నా ఫైల్ తప్ప మరే కాగితాలు తీసుకు రాలేదన్నారు. ఇంటి వాచ్మెన్ తనతో పాటు లోపలకు వచ్చాడని చెప్పారు. జగ్గయ్యపేటలో ఉన్న భూమి పత్రాలు తీసుకోవడానికి వచ్చానని చెప్పడం అవాస్తవం అన్నారు. రాకేష్తో పరిచయం గురించి కూడా ఆమె చెప్పారు. రాకేష్ రెడ్డితో పరిచయం గురించి చెబుతూ.. టెట్రాన్ కంపెనీలో కార్మికుల సమస్య తలెత్తినప్పుడు తాను సెటిల్ చేస్తానని రాకేష్ వచ్చాడని, 2017లోఅతనితో పరిచయం ఏర్పడిందని, అప్పటికి మావయ్యకు అతను తెలియదని, తనతో రాకేష్ తరుచూ మాట్లాడేవాడని చెప్పారు. అతని ప్రవర్తన నచ్చక 9 నెలలుగా దూరంగా ఉంటున్నానని చెప్పారు. మావయ్యను కలిసినప్పుడు రాకేష్ రెడ్డి గురించి చెప్పి అతని నెంబర్ తీసేయమని చెప్పాడు. రూ.4 కోట్లు తీసుకున్నది రాకేష్ వద్దేనని మావయ్య చనిపోయాక తెలిసిందన్నారు. మావయ్య విలువ తెలిసినవారు ఎవరు కూడా ఆయనను చంపితే లాభం జరుగుతుందని అనుకోరని చెప్పారు. ఆయనతో కలిసి పని చేస్తేనే లాభమన్నారు.