ఓ అమ్మాయి ఉందంటూ తీసుకొచ్చి..: జయరాం హత్య కేసులో జూనియర్ ఆర్టిస్ట్?
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త జయరాం హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన హత్యలో ఆయన పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పాత్ర ఉందా... అనే అనుమానానికి కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్
కీలక నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు చెప్పాడని తెలుస్తోంది. ఈ హత్య కేసులో సూర్య పాత్ర కూడా ఉందని చెప్పాడని వార్తలు వస్తున్నాయి. గత నెల 29న సాయంత్రం జయరాంకు సూర్య ఫోన్ చేశాడట. ఓ అందమైన అమ్మాయి ఉందని జయరాంకు చెప్పాడట. దీంతో మరుసటి రోజు సూర్యకు జయరాం ఫోన్ చేసి వివరాలు అడిగాడు. అమ్మాయి కావాలంటే ఓ చోటుకు రావాలని చెప్పాడు. ఆ తర్వాత జయరాంను సూర్య.. రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకు వెళ్లాడు. డబ్బుల విషయంలో జయరాం, రాకేష్ రెడ్డిల మధ్య గొడవ జరిగింది. రాకేష్ కోపంతో జయరాం తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి నందిగామలో పడేశారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది.
ఎన్నారై జయరాం హత్య కేసు: ఏసీపీ కార్యాలయానికి శిఖా చౌదరి.. ఇలా ఎందుకు చేశారు?
హత్యలో పలువురి పాత్ర
జయరాం హత్య కేసులో మొత్తం పలువురి పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే ఇందులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్ర పాత్ర ఏమిటో తేలాల్సి ఉందని చెబుతున్నారు. జయరాంను హత్య చేసేందుకు రౌడీషీటర్ నగేష్ సాయాన్ని నిందితుడు రాకేష్ రెడ్డి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆస్తులు కొట్టేసేందుకు రాకేష్ రెడ్డి ప్రయత్నించారని అంటున్నారు. జయరాంకు నగేష్.. హానీట్రాప్ సందేశాలు పెట్టాడు. నగేష్ ఓ రౌడీషీటర్. అతను ఈ హత్యకు సహకరించాడు. ఆస్తి కొట్టేసేందుకు జయరాంతో ఖాళీ బాండ్ పేపర్ల పైన కూడా సంతకాలు చేయించాడు నగేష్. ఆ బాండ్ పేపర్లతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయాలని భావించారు. రాకేష్ రెడ్డి ఇంట్లో జయరాంను బంధించడంతో ఈ మేరకు అతని నివాసంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు.
రాకేష్ రెడ్డికి పలువురితో పరిచయాలు
ఇక, రాకేష్ రెడ్డి రియల్ దందా చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వ్యాపారులను ఫోన్లో బెదిరించేవాడని తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకులతో రాకేష్ రెడ్డికి పరిచయాలు ఉన్నాయి. రాకేష్ రెడ్డికి పదకొండు మంది పోలీసులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. కేసు విచారణ అనంతరం రాకేష్ రెడ్డితో సంబంధాలు ఉన్న ఇతర పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోనున్నారు.