జయరామ్ మర్డర్ కేసులో రియల్టర్ల పాత్ర? రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్ ఎవరు?
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారుతోంది. తాజాగా జయరామ్ హత్య కేసులో రియల్టర్ల ప్రమేయం ఉందనే అంశం చర్చానీయాంశంగా మారింది. అసలు రాకేశ్ రెడ్డి నుంచి జయరామ్ అప్పు తీసుకోలేదనే విషయం గుర్తించారు పోలీసులు.
పూటకో ట్విస్టు..!
జయరామ్ హత్యకేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. పూటకో ట్విస్టు బయటకొస్తోంది. జయరామ్ మర్డర్ కేసు దర్యాప్తు సజావుగా జరగాలన్న ఆయన భార్య పద్మశ్రీ ఆరోపించింది. ఆ మేరకు ఏపీ పోలీసులు ఆ కేసును తెలంగాణకు బదిలీ చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు కూడా బయటపడ్డాయి. రాకేశ్ రెడ్డిని బుధవారం (13.02.2019) నాడు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండోరోజు దర్యాప్తులో భాగంగా మరికొన్ని నిజాలు వెలుగుచూశాయి.
రియల్టర్ల ప్రమేయం..! తప్పుడు పత్రాలు
జయరామ్ ను హత్య చేసిన తర్వాత కొందరు రియల్టర్లను రాకేశ్ రెడ్డి రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. రాకేశ్ రెడ్డి నుంచి జయరామ్ అప్పు తీసుకోలేదనే విషయం పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే జయరామ్ ను.. రాకేశ్ రెడ్డి ట్రాప్ చేశాడని అనుమానిస్తున్నారు. జయరామ్ ను బెదిరించి డబ్బు గుంజే ప్రయత్నం చేశాడనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా రాకేశ్ రెడ్డి ఆయనకు అప్పు ఇవ్వలేదని గుర్తించిన పోలీసులు.. మర్డర్ తర్వాత రియల్టర్ల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కొందరు రియల్టర్ల సహకారంతో హత్య చేసిన తర్వాత తప్పుడు అప్పు పత్రాలు సృష్టించినట్లు సమాచారం.
రౌడీ షీటర్ పాత్ర?
రాకేశ్ రెడ్డి చెప్పిన సమాచారం మేరకు వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాకేశ్ రెడ్డికి పూర్తిస్థాయిలో సహకరించాడనే ఆరోపణలతో వాచ్ మెన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక జూనియర్ ఆర్టిస్టుతో పాటు ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చింతల్ కు చెందిన ఓ రౌడీ షీటర్ ను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.