కరెంట్ బిల్లుల మొత్తం బకాయి ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు.!కట్టలేమంటున్న సామాన్యులు.!
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ తరుణంలో మూడు నెలల పాటు ఎవ్వరూ కూడా కరెంటు బిల్లులు చెల్లించకూడదని పెద్ద మనసుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాలు అబాసు పాలయ్యాయి. ప్రతినెల వచ్చే బిల్లులకు రెట్టింపు కరెంటు బిల్లులు రావడం, సామన్యుడు కట్టలేని రీతిలో ఉన్న బిల్లుల చెల్లింపులో స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి రాకపోవడంతో నిరుపేదలు ఇప్పటికి ఇబ్బందులపాలవుతున్నట్టు తెలుస్తోంది.
ఇంకా భారంగానే కరెంటు బిల్లుల చెల్లింపులు.. కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు..
లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఉపాది కోల్పోయిన లక్షాలాది కుటుంబాలకు సీఎం చంద్రశేఖర్ రావు ఊరటనిచ్చే ప్రకటన చేసినప్పటికి అధికార యంత్రాంగం నిర్వాకం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. నిరుపేదలు, సామాన్యులు ఇంకా కరెంటు బిల్లుల చెల్లింపు అంశంలో కష్టాలను చవిచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు మధ్య సమన్వయం లేక పోవడంతో కరెంటు బిల్లుల చెల్లింపు అంశంలో స్పష్టత లోపించిందనే చర్చ జరుగుతోంది. దీంతో సామాన్య మద్య తరగతి వినియోగ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.
తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు.. ఎలా కట్టాలంటున్న సామాన్యుడు..
హైదరాబాద్ నగరంలో వ్యాపారాలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నప్పటికి ఉపాది అవకాశాలు మాత్రం ఇంకా ఊపందుకోలేదని తెలుస్తోంది. అంతే కాకుండా చాలా వరకు చాలా మంది వారు కోల్పోయిన ఉద్యోగాలు ఇంతవరకూ పొందిన దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని సంస్థల్లో ఉద్యోగులను పూర్తి స్థాయిలో తొలగించక, జీతాలన్ని సాగానికి సగం కొతం విధించి చెల్లిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారు కూడా చాలా వరకు నగరంలో జీవనాన్ని నెట్టుకొస్తున్న సందర్బాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సామాన్యులందరికి కరెంటు బిల్లుల చెల్లింపు శరాఘాతంలా పరిణమించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి లోపించిన సమన్వయం.. ఆర్ధిక సమస్యల్లో సామాన్యుడు..
కరెంటు బిల్లుల అంశంలో ప్రభుత్వం ఇచ్చిన అదేశాలు ఏ అధికారులు పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. ఉదాహరణకు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు ఒకే సారి మూడు వేలుగా రావడం, అంత మొత్తం ఒకే సారి చెల్లించేని సమయంలో మూడు ఇన్స్టాల్ మెంట్లలో కట్టుకునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్ది ఓ ప్రకటన కూడా చేసారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరింత ఇబ్బందుల పాలు చేయకుండా కరెంటు బిల్లులను వారి వారి స్ధోమతకు తగ్గట్టుగా కడతారని, అధికారులు పూర్తిస్ధాయిలో వెసులుబాటు ఇవ్వాలని గత మూడు నెలల క్రితం ప్రకించారు.
కరెంటు బకాయిల కిస్తీలు మరో రెండు నెలలు పొడిగించాలి.. టీ సర్కార్ కు విజ్ఞప్తి చేస్తున్న సామాన్యులు..
కాగా ఇదే కరెంటు బిల్లుల చెల్లింపుల్లో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు ఐదు వేలున్న బిల్లును రెండు విడతలుగా చెల్లిస్తామంటే ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లించాలని కర్కషంగా తేల్చి చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సామాన్యుడికి కరెంటు బిల్లుల మొత్తం చెల్లింపు మోయలేని భారంగా పరిణమించింది. ఎవరికి చెప్పుకోలేని పరిస్దితుల్లో ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టి కరెంటు బిల్లులు చెల్లించే పరిస్ధితులు నగరంలో తలెత్తాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి మరో రెండు నెలల పాటు బిల్లులను కిస్తీలుగా చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలనే కాకుండా, విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.