స్వీటు బాక్సుల్లో కోటిన్నర.. హైదరాబాద్ టు దుబాయ్.. చివరకు..!
హైదరాబాద్ : స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. విదేశాల నుంచి బంగారం, కరెన్సీ మూటలు అడ్డదారుల్లో తీసుకొస్తూ కోట్లు వెనుకేస్తున్నారు. గోల్మాల్ చేస్తూ, అధికారుల కళ్లుగప్పుతూ యధేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. అయితే విదేశాల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్ వరకు చేరుతున్నా.. శంషాబాద్ ఎయిర్పోర్టులో మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. అదలావుంటే ఈసారి మాత్రం సీన్ రివర్సయింది. హైదరాబాద్ టు దుబాయ్ ప్లాన్ బెడిసికొట్టింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్కి అక్రమంగా తరలిస్తున్న విదేశీ నగదును భారీగా స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. స్వీటు బాక్సులు, ఉస్మానియా బిస్కెట్ల డబ్బాల్లో విదేశీ కరెన్సీ కట్టలకొద్దీ నింపి అక్రమంగా తరలిస్తున్న ఇద్దర్ని అధికారులు పట్టుకున్నారు. దాదాపు ఇండియన్ కరెన్సీలో కోటిన్నర విలువ చేసే విదేశీ కరెన్సీ పట్టుబడటం చర్చానీయాంశమైంది.
హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?
సరిగ్గా పది రోజుల కిందట ఇలాగే అక్రమంగా 9 కిలోలకు పైగా బంగారంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణీకుడు కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా విలువచేసే బంగారాన్ని సదరు ప్రయాణీకుడు తీసుకొచ్చిన వైనం హాట్ టాపికయింది.
నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో 9 కిలోల 200 గ్రాముల బంగారాన్ని నీట్గా సర్దేశాడు. ఎంతలా అంటే తాను ఎట్టిపరిస్థితుల్లో చిక్కకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే అతడి తీరుపై అనుమానం వచ్చి తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడింది. నాలుగు ఐరన్ బాక్సుల్లో అంత బంగారం మహా బాగా పట్టించేశాడు. ఇటీవల అంత భారీ మొత్తంలో బంగారం పట్టడం అదే తొలిసారి అని చెప్పారు కస్టమ్స్ అధికారులు. అదలావుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు 40 కిలోల వరకు బంగారం పట్టుబడినట్లు తెలుస్తోంది.