వన్ ఇండియా ఎఫెక్ట్..! అవినీతి తహసీల్దార్ లావణ్య అరెస్టు..!!
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నివాసంలో పెద్ద మొత్తంలో నగదు లభించడంతో ఈ కేసును మరింత శోధిస్తున్నారు. ఆమె గత కార్యకలాపాలపై వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు ఆమె నివాసంలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టు చేశారు. ఆమె భర్త వెంకటేశ్ నాయక్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన మున్సిపల్ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య నిన్న ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా.. లావణ్య వ్యవహారం బయటపడింది. లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు ఏసీబీ విచారణలో గుర్తించారు. హయత్నగర్లోని ఆమె నివాసంలో సోదాలు జరపగా, 93లక్షల రూపాయల నగదు, 40తులాలకు పైగా బంగారం గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో లావణ్యను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.
అవినీతి తహసీల్దార్ లావణ్య వద్ద అనూహ్యంగా బంగారు ఆభరణాలను గుర్తించారు. నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. లావణ్య.. 2016 నుంచి కేశంపేట తహసీల్దారు. ఆమె భర్త జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్. ఇంకా ఏవైనా అక్రమాలున్నాయేమోనని కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోదక శాఖ అధికారులు సాయంత్రం నుంచి రికార్డులను పరిశీలిస్తున్నారు.
అనంతయ్యతో పాటు వి.లావణ్యపై కేసు నమోదు చేశామని అవినీతి నిరోదక శాఖ ఉప సంచాలకుడు రమణకుమార్ తెలిపారు. వీఆర్వోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాక జైలుకు తరలించారు. అవినీతి తహసీల్దార్ లావణ్య నోరు విప్పితే మరిన్ని స్థిర, చరాస్తుల వివారాలు తెలిసే అవకావాలు ఉన్నాయంటున్నారు అవినీతి నిరోధక శాఖ అదికారులు.