పెళ్లి రోజు నాడే విషాదం.. హెచ్ఆర్ ఉద్యోగి అనుమానస్పద మరణం
హైదరాబాద్ : మ్యారేజ్ డే నాడే ఓ ఉద్యోగి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. సాయంత్రం త్వరగా వస్తానంటూ భార్యకు చెప్పి వెళ్లిన భర్త విగతజీవిగా మారడం విషాదం నింపింది. బంజారాహిల్స్లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశమైంది. పెళ్లి రోజు ఆనందంగా జరుపుకోవాల్సిన హెచ్ఆర్ ఉద్యోగి ఆకస్మాత్తుగా తనువు చాలించడం ఆ కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. ఆఫీస్కంటూ వెళ్లిన భర్త రాక కోసం ఎదురుచూసిన ఆ భార్య.. భర్త చనిపోయాడని తెలియగానే విషాదంలో మునిగిపోయింది.
ఆఫీస్కంటూ వెళ్లి అనంతలోకాలకు..!
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి శివ నాగరాజు (36సం.)... హైదరాబాద్లోని జారో ఎడ్యుకేషన్ అనే సంస్థలో ఎనిమిదేళ్లుగా హెచ్ఆర్ మేనేజర్గా పని చేస్తున్నారు. భార్యా పిల్లలతో కలిసి హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో నివాసముంటున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా శుక్రవారం నాడు ఆఫీస్కు వెళుతున్నానని చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఫేస్బుక్ పరిచయం, ప్రేమ పెళ్లి.. మూడు నెలలకే కథ అడ్డం తిరిగింది
భర్త స్నేహితుడికి ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి..!
శుక్రవారం నాడు ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లిన శివ నాగరాజుకు ఆయన భార్య రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేశారు. అయితే ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పిన నాగరాజు రాత్రి 12 గంటలు దాటినా రాలేదు. దాంతో కంగారుపడిన ఆయన భార్య ఏంచేయాలో తెలియక అదే రోజు అర్ధరాత్రి నాగరాజు స్నేహితుడికి ఫోన్ చేశారు. దాంతో శనివారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు ఆయన హుటాహుటిన నాగరాజు పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లారు.
రక్తపు మడుగులో శివ నాగరాజు.. మ్యారేజ్ డే నాడే దారుణం
ఆయన అక్కడకు వెళ్లేసరికి నాగరాజు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దాంతో నాగరాజు భార్యకు సమాచారం ఇవ్వడంతో పాటు అటు పోలీసులకు కూడా ఫోన్ చేశాడు. ఆయన పనిచేస్తున్న కార్యాలయంలో సీసీ కెమెరాలు ఆపేసినట్లు తెలుస్తోంది. బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడగా అయిదవ అంతస్తు నుంచి కిందపడినట్లుగా క్లూ దొరికినట్లు సమాచారం. అదలావుంటే మృతుడి మెడపై కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శనివారం నాడే ఆయన పెళ్లిరోజు కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సరిగ్గా మ్యారేజ్ డే నాడే ఆయన చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శివ నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు ఫైల్ చేశారు. ఆయన పనిచేసే కార్యాలయం మేనేజర్తో పాటు ఇతర సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన భార్య నవ్యను కూడా వివిధ కోణాల్లో ప్రశ్నించిటనట్లు తెలిసింది.