మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..వందకు చేరువలో ధర.. వామ్మో అంటున్న సగటు గృహిణి!
Recommended Video
హైదరాబాద్ : ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు నెలల క్రితం సామాన్య గృహిణికి చుక్కలు చూపించి ఉల్లి ఆ తర్వాత కాస్త శాంతించింది. రెండు నెలల తర్వాత ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. అసలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజలను ఉల్లిగడ్డల ధరలు కలవర పెడుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం కిలో ధర 20 రూపాయల నుంచి 25 రూపాయల ఉన్న ఉల్లి ఇప్పుడు 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు.
హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6,500 రూపాయలకు చేరింది. ఇక రిటెయిల్ గా చుస్తే కిలో 80 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఉల్లి కిలో 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది.
వాస్తవానికి ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన ఉల్లి పంట వర్షాలకు దెబ్బతినడం వల్ల దాదాపు 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఉల్లి కొరత కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మహారాష్ట్ర లో వచ్చిన భారీ వరదలు ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఉల్లిని ప్రధానంగా పండించే మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు, వరదల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.
దీంతో హైదరాబాద్ మార్కెట్కు ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండి సరుకు తక్కువగా ఉండడంతో ధర విపరీతంగా పెరుగుతోందని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధరలు పెరిగిపోడంతో విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతి చేయడమే గాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను ప్రభుత్వం సడలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఉల్లి దిగుమతికి ఏర్పాట్లు చేస్తున్నారు.