ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?
Recommended Video
హైదరాబాద్ : ఉల్లి ఘాటేమో గానీ.. ధరలు మాత్రం కంట నీరు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అటు ఇటుగా 20, 25 రూపాయలున్న కిలో ఉల్లిపాయల ధర ఆమాంతం 35 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్సుందన్న వార్తల నేపథ్యంలో జనాలు టెన్షన్ పడుతున్నారు. అయితే ధరలు అదుపులోనే ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అనంతయ్య మీడియాకు తెలిపారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఉల్లి ధరలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు.
ఉల్లి ధరల ఘాటు మరో నెల రోజులు భరించక తప్పదన్నారు అనంతయ్య. అయితే ధరలు మాత్రం కంట్రోల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతులు తక్కువ కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ క్రమంలో ఉల్లి ధర ప్రస్తుతం క్వింటాల్కు 3 వేల 300 రూపాయలు పలుకుతోందని తెలిపారు. అయితే ధరల అదుపుపై నిఘా ఉంచామని.. వ్యాపారులు ఒకవేళ రెచ్చిపోతే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!
ప్రస్తుతం రోజుకు కేవలం 15 వేల బస్తాల ఉల్లిపాయలు మాత్రమే దిగుమతి అవుతున్నాయని వివరించారు అనంతయ్య. 10 కిలోల హోల్ సేల్ ధర 280 రూపాయలు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కేజీ 35 రూపాయలు పలుకుతోందని చెప్పుకొచ్చారు. ఒకవేళ పరిస్థితులు తారుమారై ఉల్లి ధరలు అమాంతం పెరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని రైతు బజార్లలో స్పెషల్ కౌంటర్ల ద్వారా ఉల్లి పాయలు తక్కువ ధరకు అందించేలా చూస్తామన్నారు. అదలావుంటే కొత్త పంట సెప్టెంబర్ నెల చివరి నాటికి వస్తుందన్నారు. అలా రాష్ట్రానికి ఉల్లి దిగుమతి మొదలైతే ధరలు కిలో 8 నుంచి 12 రూపాయల వరకు దొరికే ఛాన్సుందని తెలిపారు.