ఆర్టీసీ సమ్మె: 6 లోపు విధుల్లో చేరింది ఎంతమందో తెలుసా?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసినప్పటికీ సమ్మెను విరమించేందుకు ఆర్టీసీ సంఘాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమ డిమాండ్ల నెరవేర్చే వరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
6 దాటితే అంతే సంగతులు: టీఎస్ఆర్టీసీ సమ్మెపై మంత్రి అల్టిమేటం
అయితే, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో కొందరు మాత్రం విధుల్లో చేరారు. ఈ క్రమంలో శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్లు యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీస్ స్టాఫ్, మెకానిక్లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
శనివారం సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినప్పటికీ కార్మిక సంఘాలు సమ్మెను కొనసాగించాలనే నిర్ణయించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
కాగా, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేశారు. శనివారం(అక్టోబర్ 5) సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 160 మంది ఉద్యోగులు విధుల్లో చేరడం గమనార్హం.
అయితే, విధుల్లో చేరని పక్షంలో ఇకపై వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రభుత్వం పరిగణించదని మంత్రి తేల్చి చెప్పారు. అంతేగాక, భవిష్యత్లో కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీలోకి తీసుకునేది లేదని మంత్రి అజయ్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణాకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో శాశ్వత విధానాలను రూపొందించే అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని చెప్పారు. మూడు వేల నుంచి నాలుగువేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడిపించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
అర్హులైన యువత, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. తక్షణమే యువతకు శిక్షణ ఇచ్చి బస్సులను నడిపించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని పువ్వాడ అజయ్ వివరించారు.
అంతేగాక, ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇస్తామని మంత్రి తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొనే పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై ఆదివారం ఉన్నతస్థాయిలో సమీక్షించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ ఎండీ సురేష్ శర్మ వెల్లడించారు.