ట్రంప్ ఒక్కడే బాకీ -మోదీ వారసుడి ఎన్నిక -గ్రేటర్లో అమిత్ షా ప్రచారంపై ఓవైసీ విమర్శలు
బీజేపీ జాతీయ నేతల రంగప్రవేశంతో హైదరాబాద్ స్థానిక ఎన్నికలు కాస్తా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన ఆదివారం అన్ని పార్టీలూ తమ తురుపుముక్కలతో కీలక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాయి. బీజేపీ తరఫున ఇప్పటికే బడా నేతలు వచ్చివెళ్లగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరంలో రోడ్ షో నిర్వహించారు. షా హైదరాబాద్ పర్యటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
మూడు సెగ్మెంట్లలో అమిత్ షా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ సెగ్మెంట్ల(హైదరాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్)లోని పలు డివిజన్లు కవర్ అయ్యేలా కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం నగరంలో పర్యటన జరిపారు. చివరి రోజు ప్రచారానికి అమిత్ షా రావడంతో కాషాయ శ్రేణులు భారీ ఎత్తున సందడి చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న షా.. అక్కడి నుంచి నేరుగా పాతబస్తీ(చార్మినార్)లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి వరకు రోడ్ షో నిర్వహించారు. షా పర్యటనపై ఓవైసీ ఏమన్నారంటే..
ట్రంప్ ఒక్కడే మిగిలాడు..
‘‘బల్దియా ప్రచారంలో బీజేపీ నేతల బిల్డప్ మామూలుగా లేదు. అసలివి స్థానిక ఎన్నికలా? లేక ప్రధాని పదవికి నరేంద్ర మోదీ వారసుణ్ని ఎన్నుకునే ప్రక్రియా? అనేంత స్థాయిలో హడావుడి చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి డజన్ల కొద్దీ నేతల్ని దింపిన బీజేపీ.. తాజాగా అమిత్ షాను రంగంలోకి దించింది. ఇక గ్రేటర్ లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే మిగిలున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో చిన్నపిల్లలు కూడా ఇదే మాట అంటున్నారు'' అని ఓవైసీ ఎద్దేవా చేశారు.
గ్రేటర్లో అమిత్ షా: వ్యూహం తెలుసా? -ఒకేదెబ్బకు 3సెగ్మెంట్లు - పాతబస్తీలో పూజలు -లష్కర్లో రోడ్ షో
తరాలు మారినా.. హైదరాబాద్ పేరదే
తెలంగాణలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే, హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ చేసిన ప్రకటపైనా ఎంపీ అసదుద్దీన్ మండిపడ్డారు. శనివారం రాత్రి కార్వాన్ లో ఎంఐఎం అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించిన ఆయన.. తరాలు మారినా, హైదరాబాద్ పేరు మారబోదని, ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలను హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగరంగా భావించి, ప్రజలంతా ఎంఐఎంకు ఓటేసి, హైదరాబాద్ ను గెలిపించాలని ఓవైసీ వ్యాఖ్యానించారు. 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి డిసెంబర్ 1న బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.