ఆపరేషన్ కూకట్పల్లి : చంద్రబాబు కు ప్రతిష్ఠాత్మకం : జగన్ - పవన్ దృష్టి అక్కడే..!
Recommended Video
తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు హాట్ సీట్ కూకట్పల్లి. టిడిపి పదమూడు స్థానాల్లో పోటీ చేస్తున్నా.. టిఆర్యస్ 119 స్థానాల్లో బరిలో ఉన్నా..ఇప్పుడు ఏపి ప్రజల దృష్టి మాత్రం కూకట్ పల్లి మీదే నెలకొంది. కూకట్పల్లి లో గెలుపు ఒక రకంగా చంద్రబాబుకు వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. అక్కడ సుహాసినిని ఏరి కోరి చంద్రబాబు బరిలో దింపారు. దీంతో.. అక్కడ పరిస్థితిని స్వయంగా ఎప్పటికప్పుడు అంచనా వేయటంతో పాటుగా..అక్కడ గెలుపు బాధ్యతలను ఏపి టిడిపి నేతలకే అప్పగించారు. ఇదే సమయంలో..టిఆర్యస్ సైతం అక్కడ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా..అక్కడ టిడిపిని ఓడిపోవాలని వైసిపి- జనసేన కోరుకుంటున్నాయి.
అందరి దృష్టి కూకట్పల్లి పైనే..
తెలంగాణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో లోని కూకట్పల్లి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడి రాజకీయ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చయింది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ప్రచారంలో దూసుకుపోతుండగా, ఆలస్యంగా రంగంలోకి దిగిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచార భారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణపైనే వేశారు. డు రోజుల క్రితమే చంద్రబాబు, బాలకృష్ణలు రోడ్షోలు నిర్వహించగా.. తాజాగా మరోసారి చంద్రబాబు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతోకలిసి కూకట్పల్లిలో మరో సభ నిర్వహించారు. కాగా, స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు చంద్రబాబు స్వయంగా దిశా నిర్దేశం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు మాధవరం సుదర్శన్రావు, గొట్టిముక్కల పద్మారావు, ఎండీ.మోయిజ్, గొట్టిముక్కల వెంగళరావు, గాలి బాలాజీ, శేరి సతీ్షరెడ్డి లతో మంతనాలు సాగిస్తూ సూచనలు చేస్తున్నారు.
చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకం..
కూకట్ పల్లి సీటు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. తాను ఏరి కోరి నందమూరి సుహాసిని అని అక్కడ అభ్యర్ధిగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది పార్టీలోనే కాదు..కుటుంబ పరంగానూ కీలకంగా మారింది. దీంతో ఎలాగైనా అక్కడ గెలుపు కోసం మరోవైపు ఏపీకి చెందిన ముఖ్య నాయకులందరినీ కూకట్పల్లిలో మోహరించి వార్డులు, డివిజన్ల వారిగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యనేతలతో పాటు పార్టీ కార్యకర్తలు సైతం కూకట్పల్లి లాడ్జీల్లో దిగారు. గ్రేటర్లోని టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ఏపీ నేతలంతా హైదరాబాద్ మకాం వేశారు. ఉదయం వేళలల్లో తమకు అప్పగించిన ప్రాంతంలో తమ సామాజికవర్గం ఓటర్లను కలుసుకుంటున్న నాయకులు.. రాత్రివేళల్లో ఎలాగైనా గెలవాలన్న వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఏపీ టీడీపీ నేతలు కళా వెంకట్రారావు, ప్రభాకర్ చౌదరి, రామ్మోహన్నాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వేదవ్యాస్, గొట్టిపాటి రవికుమార్, బీద రవిచంద్రయాదవ్, జూపూడి ప్రభాకరరావు, కనుమూరి బాపిరాజు, రుద్రరాజు తదితరులు వారం రోజులుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని 380 బూత్లకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేసే దిశగా ‘దేశం' ముఖ్య నేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
కెటిఆర్ కు బాధ్యతలు : ఎత్తులు-పై ఎత్తులు..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీకి 99 సీట్లు తెచ్చి పెట్టిన కెటిఆర్ కు సీమాంధ్రులు ఎక్కువగా ప్రభావం చూపే నియో జకవర్గాల్లో గెలుపు బాధ్యతలను కెసిఆర్ అప్పగించారు. ఏపి నుండి వచ్చిన టిడిపి నేతలు తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే, టిడిపి కి కెపిహెచ్బి లో మాత్రమే పట్టు ఉం దనేది టిఆర్యస్ నేతల అంచనా. దీంతో టిడిపి సైతం మూసాపేట, బాలానగర్లో ఓ మోస్తరుగా, కూకట్పల్లి, అల్లాపూర్, బోయిన్పల్లి, ఫతేనగర్లో పూర్తి బలహీనంగా ఉందని గుర్తించిన నాయకులు ప్రత్యేక మంత్రాంగానికి వ్యూహం రచించినట్టు సమాచారం. ప్రాంతాలు, సామాజిక వర్గాల వారిగా నాయకులను ఆయా ప్రాంతాలకు ఇన్చార్జులుగా నియమించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కెటిఆర్ టిడిపి వ్యతిరేక వర్గాలను తమ వైపు తిప్పుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. టిడిపిని వ్యతిరేకించే వర్గాలతో పాటుగా.. వైసిపి - జనసేన అభిమానులను సైతం కలిసి వారి మద్దతు కూడగడుతున్నారు. ఆ రెండు పార్టీలు సైతం టిడిపి ని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు తెలంగాణ తో పాటుగా ఏపి ప్రజల దృష్టి కూకట్పల్లి మీదే నెలకొంది.