ప్రాజెక్టుల్లో అక్రమాలు అంటూ.. కేసీఆర్ కుటుంబం టార్గెట్.. విపక్ష నేతల ఫైట్..!
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లోనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందంటూ ఫైరవుతున్నారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ఎండగడతామని.. ఆ క్రమంలో ఎంతవరకైనా వెళతామంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఈ విషయంలో గులాబీ దండుకు చెక్ పెట్టేలా అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ లీడర్ వివేక్ వేర్వేరు సందర్భాల్లో కేసీఆర్పై సంధించిన ఆరోపణాస్త్రాలు చర్చానీయాంశంగా మారాయి.
ప్రాజెక్టులపై విపక్ష నేతల ధ్వజం
తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలం పుంజుకుంది. క్షేత్ర స్థాయిలో జనాలను ఆకట్టుకుంటూ తిరుగులేని శక్తిగా తయారైంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సైతం కారెక్కిస్తూ అసెంబ్లీలో ప్రతిపక్షం అనే మాట లేకుండా తయారైంది పరిస్థితి. సభలో అధికార పార్టీని కడిగి పారేసే ఛాన్స్ లేకపోవడంతో క్షేత్ర స్థాయిలోనే అమీతుమీకి సిద్ధమంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలు అవలంభిస్తున్నారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఇంతవరకు ఏమి చేయలేకపోయిందని మండిపడుతున్నారు. ఇక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫైరవుతూనే ఉన్నారు.
కోమటిరెడ్డి ప్లాన్కు పోలీసులు బ్రేక్.. హైకోర్టును ఆశ్రయిస్తానంటూ సవాల్..!
రేవంత్ రెడ్డి ఫైర్.. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల డిజైన్లు మార్చారు..!
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్పై ఆరోపణాస్త్రాలు సంధించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని ఫైరయ్యారు. ఒకవేళ కమీషన్ల కోసం కక్కుర్తి పడకుంటే.. ప్రాజెక్టుల డీపీఆర్ ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం నిర్మాణాత్మక పోరాటం చేస్తామన్నారు. ప్రాజెక్టుల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తుగ్లక్ పాలన అంటూ వివేక్ గరం.. కుటుంబ శ్రేయస్సు కోసమే ప్రాజెక్టులు..!
సీఎం కేసీఆర్ పాలన తుగ్లక్ పాలన తలపిస్తోందని ధ్వజమెత్తారు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఉద్యమ సమయంలో ఎక్కడకు వెళ్లినా.. హైదరాబాద్లో చారిత్రాక కట్టడాలున్నాయని గొప్పగా చెప్పిన కేసీఆర్.. ఇవాళ వాటిని కూల్చివేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని మండిపడ్డారు వివేక్. ప్రాజెక్టుల నిర్మాణం అనేది కల్వకుంట్ల కుటుంబ శ్రేయస్సు కోసమేనని ఫైరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరానికి తరలించడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామంటూ గొప్పలు చెప్పి ఇప్పుడేమో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి దళితుల భూమిని లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రెంట్ కట్టకుండా పరేషాన్.. ఓనర్కు చుక్కలు.. తుపాకీతో కాల్చుకుని..!
అటు కోమటిరెడ్డి కూడా.. ప్రాజెక్టులతో టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా..!
మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పెద్ద స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది. అటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన కోసం సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ప్రభుత్వం దిగొచ్చేలా బ్రాహ్మణ వెల్లంల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టాలని డిసైడయ్యారు. ఈ నెల 26 నుంచి 29 వరకు ఉదయ సముద్రం - బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు సాధన రైతు పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు అనుమతితో ఎలాగైనా పాదయాత్ర చేసి తీరుతానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి.